సెంట్రల్ జైల్లో లేడీ డాన్, మర్డర్ మణికంఠన్ రాసలీలలు, ప్రత్యేక సెల్, మహిళా ఖైదీలతో జల్సా!
పుదుచ్చేరి: మగ, మహిళా ఖైదీలు జైల్లో కలుసుకుని రాసలీలలు సాగిస్తున్నారు. కొందరు మగ ఖైదీలు బరితెగించి జైల్లో నాలుగు గోడల మధ్య మహిళా ఖైదీలను లైంగిక వేదింపులకు గురి చేస్తున్న దారుణ ఘటన కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరిలోని కాలాపట్టిలోని సెంట్రల్ జైల్లో జరిగింది.
తమిళ సాయంకాల దినపత్రిక మాలైమలర్ పుదుచ్చురి సెంట్రల్ జైల్లో జరుగుతున్న దారుణాలను వెలుగులోకి తీసుకు వచ్చింది. విషయం తెలుసుకున్న పుదుచ్చేరి జైళ్ల శాఖ ఐజీ పంకజ్ కుమార్ ఝూ అర్దరాత్రి ఆకస్మికంగా జైల్లో తనిఖీలు చేపట్టి నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు.
జైల్లో 600 మంది ఖైదీలు
పుదుచ్చేరిలోని కాలాపట్టిలోని సెంట్రల్ జైల్లో 600 మందికి పైగా ఖైదీలు ఉన్నారు. వారిలో వంద మంది మహిళా ఖైదీలు ఉన్నారు. జైలులో పురుష, మహిళా ఖైదీలు వేర్వేరుగా ఉండటానికి అన్ని భద్రతా ఏర్పాట్లు చేశారు. పురుష, మహిళా ఖైదీలు కలుసుకోకుండా అన్ని ఏర్పాట్లు చేసినా అధికారులు మాత్రం డబ్బు కోసం బరితెగించారు.
మర్దర్ మణికంఠన్
హత్యలు, కిడ్నాప్ లు, లూటీలు, రాబరీలు తదితర క్రిమినల్ కేసుల్లో మర్దర్ మణికంఠన్ అనే పేరుమోసిన రౌడీషీటర్ ను అరెస్టు చేసి సెంట్రల్ జైల్లో పెట్టారు. ఇతను జైలు నుంచి మొబైల్ ఫోన్ లో తన అనుచరులతో మాట్లాడి వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలను బెదిరించి డబ్బులు వసూలు చేయిస్తున్నాడు.
మాజీ స్పీకర్ హత్య కేసులో లేడీ డాన్
పుదుచ్చేరీ శాసన సభ మాజీ స్పీకర్ వీఎమ్ సీ. శివకుమార్ గత జనవరి నెలలో దారుణ హత్యకు గురైనారు. ఈ హత్య కేసులో పోలీసులు కారైక్కాల్ కు చెందిన లేడీ డాన్ ఎళిలరసిని అరెస్టు చేసి ఇదే జైల్లో పెట్టారు. లేడీ డాన్ ఎళిలరసి జైలు నుంచి తన అనుచరులతో దందాలు చేయిస్తున్నది.
లేడీ డాన్, మర్దర్ మణికంఠన్ రాసలీలలు
లేడీ డాన్ ఎళిలరసి, మర్దర్ మణికంఠన్ జైల్లోనే రాసలీలు సాగించడానికి అధికారులు ప్రత్యేక సెల్ కేటాయించి అక్కడ మంచం కూడా పెట్టారని వెలుగు చూసింది. నిత్యం వీరిద్దరూ రాత్రి ఆ సెల్ లో రాసలీలలు సాగిస్తున్నారని తమిళ సాయంకాల దినపత్రిక వెలుగులోకి తీసుకు వచ్చింది. వీరితో పాటు మరో ముగ్గురు రౌడీషీటర్లు నిత్యం మహిళా ఖైదీలతో రాసలీలలు సాగిస్తున్నారని వెలుగు చూసింది.
అర్దరాత్రి ఐజీ తనిఖీలు
పుదుచ్చేరి జైళ్ల శాఖ ఐజీ పంకజ్ కుమార్ ఝూ అర్దరాత్రి సెంట్రల్ జైల్లో ఆకస్మిక తనిఖీలు చెయ్యడంతో ఈ వాస్తవాలు అన్నీ వెలుగు చూశాయి. పురుష, మహిళా ఖైదీలు రాసలీలలు సాగించడానికి అవకాశం కల్పించిన జైలు డిప్యూటీ సూపరెండెంట్ ఆనంద్ రాజ్, చీఫ్ వార్డెన్ వీరవాసు, వార్డన్లు కలావతి, మదివాసన్ లను వెంటనే సస్పెండ్ చేశారు. మరో ముగ్గురు అధికారులను విచారించి వారి మీద వేటు వెయ్యడానికి సిద్దం అయ్యారు. కొందరు పురుష ఖైదీలు మహిళా ఖైదీల బ్యారక్ లోకి చొరబడి లైంగిక వేధింపులకు గురి చేశారని వెలుగు చూడటంతో అధికారులు విచారణ చేస్తున్నారు.