తీర ప్రాంతాన్ని శుభ్రం చేసిన తమిళిసై..!!
కరైకల్: ఇవ్వాళ అంతర్జాతీయ కోస్తా తీర ప్రాంతాల పరిశుభ్రత దినం. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు దీన్ని నిర్వహిస్తోన్నాయి. వేలాదిమంది వలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటోన్నారు. తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుతోన్నారు. అదే సమయంలో సముద్రంలో టన్నుల కొద్దీ చెత్తా చెదారాన్ని ఎత్తేసే పనులను పలు దేశాలు చేపట్టాయి. తీర ప్రాంతాల పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఉద్దేశించిన సదస్సులు, సమావేశాలను ఏర్పాటు చేశాయి.
అమిత్ షా సభలో టీఆర్ఎస్ నేత కలకలం - కారు ధ్వంసం: విచారణకు ఆదేశం..!!
భారత్లో కూడా ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీన్ అప్ డే కొనసాగుతోంది. పుదుచ్చేరిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లెప్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. అసెంబ్లీ స్పీకర్ సెల్వంతో కలిసి ఆమె తీర ప్రాంతాల్లో చెత్తా చెదారాన్ని ఏరివేశారు. పుదుచ్చేరి సిటీ బీచ్ రోడ్ తీరంలో ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం ఎదురుగా నిర్వహించిన స్వచ్ఛ అభియాన్లో తమిళిసై సౌందరరాజన్, స్పీకర్ సెల్వం, ఇతర అధికారులు పాల్గొన్నారు. అక్కడి చెత్తా చెదారాన్ని ఎత్తేశారు.
పలువురు విద్యార్థులు ఇందులో భాగస్వామ్యులయ్యారు. ఈ తెల్లవారు జామునే తీరానికి చేరుకున్నారు. చెత్తను ఎత్తేయడానికి అవసరమైన ప్లాస్టిక్ బ్యాగ్స్, గ్లోవ్స్ను వెంట తెచ్చుకున్నారు. తమిళిసై సౌందరరాజన్ లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తానూ స్వయంగా ప్లాస్టిక్ బాటిల్స్ను ఎత్తారు. పర్యావరణం, తీర ప్రాంతాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తమిళిసై అన్నారు. స్వచ్ఛందంగా అందరూ తరలి రావాలని విజ్ఞప్తి చేశారు.
పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజల్లో అవగాహన, చైతన్యాన్ని కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్వచ్ఛభారత్ మిషన్ను అమలు చేస్తోందని తమిళిసై గుర్తు చేశారు. విద్యార్థి దశ నుంచే పరిసరాల పరిశుభ్రత పట్ల అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. సముద్ర తీరాలను పరిరక్షించుకోవాలని, తద్వారా అరుదైన జీవజాతులను కాపాడుకున్నట్టవుతుందని చెప్పారు. ప్లాస్టిక్ వంటి వ్యర్థ పదార్థాలు టన్నుల కొద్దీ సముద్రంలో కలవడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు.