ప్రీ పోల్ సర్వే: పుదుచ్చేరిలో ఎన్డీఏదే అధికారం, కాంగ్రెస్కు మొండిచేయి, బీజేపీ సీఎం?
న్యూఢిల్లీ: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో నేషనల్ డెమోక్రాటిక్ అలియన్స్(ఎన్డీఏ) అధికారం చేపట్టనుందని టైమ్స్ నౌ సీ-ఓటర్ ఓపినియన్ పోల్ వెల్లడించింది. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 30 స్థానాలకు గానూ ఎన్డీఏ కూటమి 18 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఈ సర్వే స్పష్టం చేసింది.
పుదుచ్చేరిలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏదే అధికారం
ఏప్రిల్ 6న పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో టైమ్స్ నౌ సర్వే ప్రీ పోల్ సర్వే నిర్వహించింది. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 16-20 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడనున్నాయి. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏకు 12 సీట్లు రావడం గమనార్హం.
12 సీట్లకే కాంగ్రెస్-డీఎంకే కూటమి పరిమితం
కాగా, ఏప్రిల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ ప్రొగ్రేసివ్ అలియన్స్(యూపీఏ)కు 12 స్థానాలు వస్తాయని ప్రీపోల్ సర్వే తేల్చింది.
ఈ కూటమి 10-14 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని వెల్లడించింది. ఇతర అభ్యర్థుల్లో ఒకరు గెలిచే అవకాశం ఉందని తెలిపింది. 2016 ఎన్నికల్లో కాంగ్రెస్, ద్రావిడ మున్నెట్రా కళగమ్(డీఎంకే)లు కలిసి పోటీ చేసి 17 అసెంబ్లీ స్థానాలు దక్కించుకున్నాయి.
పుదుచ్చేరిలో అధికారంలోకి వస్తే బీజేపీ ముఖ్యమంత్రి?
కాగా, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచే ముఖ్యమంత్రి అభ్యర్థి ఉంటారని కేంద్రమంత్రి అమిత్ షా చెప్పడంపై ఎన్డీఏలోని ఏఐఎన్ఆర్ కాంగ్రెస్ చీఫ్ ఎన్ రంగస్వామి అసంతృప్తితో ఉన్నారు. పుదుచ్చేరి సీఎం పదవిని రంగస్వామి కూడా ఆశిస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను ప్రకటించాలని కోరుకుంటున్నారు. అలా జరగని పక్షంలో ఒంటరిగానే పోటీ చేయాలని ఆయన భావిస్తుండటం గమనార్హం. కాగా, ఈ సర్వేపై మాజీ సీఎం వీ నారాయణస్వామి మాట్లాడుతూ.. ఈ ఫలితాలు ఎలా ఇచ్చారో తెలియదు. ప్రజల ఇచ్చే తీర్పు ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. ఎన్నికల ఫలితాల రోజే ప్రజల తీర్పు తెలుస్తుందని ఆయన అన్నారు. దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనని అన్నారు.
పుదుచ్చేరిలో ఓట్ షేర్ భారీగా పెంచుకున్న బీజేపీ
పుదుచ్చేరిలో ఎన్డీఏకు 45.8 శాతం ఓటు షేర్ లభిస్తుండగా.. ఇది గతంలో కంటే 14.0 శాతం ఎక్కువ ఉండటం గమనార్హం. 2016లో 30.5 శాతం ఉంది.
ఇక యూపీఏ ఓటు షేర్ 1.9 శాతం తగ్గనుంది. 2016లో 39.5 శాతం ఉండగా, ఇప్పుడు 37.6 శాతంకు పడిపోనుంది. కాగా, ఇటీవల పుదుచ్చేరిలో కాంగ్రెస్-డీఎంకే ప్రభుత్వం కూలిపోవడంతో నారాయణస్వామి సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో రాష్ట్రపతి పాలన విధించిన విషయం తెలిసిందే.