పన్నీర్ వర్గంలోకి ఎమ్మెల్యేలు జంప్: శశికళకు సన్నిహితుడు: సీఎంకు చెమటలు!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) వర్గంలోని ఎమ్మెల్యేలు పట్టపగలే చుక్కలు చూపించడానికి సిద్దం అవుతున్నారు. ఎడప్పాడి పళనిసామికి నిద్రలేకుండా చెయ్యాలని పన్నీర్ సెల్వం వర్గంలోని నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.
అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి జైలుకు వెళ్లే ముందు ఎడప్పాడి పళనిసామిని ముఖ్యమంత్రిని చేసి పన్నీర్ సెల్వం పదవికి చెక్ పెట్టారు. అదే సమయంలో తన అక్క కుమారుడు టీటీవీ దినకరన్ ను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించి అన్నీ తానై నడిపించాలనే ప్లాన్ తో జైల్లో కుర్చున్నారు. అయితే దినకరన్ పిచ్చి చేష్టలతో ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది.

పుంజుకుంటున్న పన్నీర్ సెల్వం
ఎడప్పాడి పళనిసామి వర్గంలోని ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవడానికి పన్నీర్ సెల్వం వర్గం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రజల్లో ఎక్కువ మద్దతు ఉన్న మావైపు వస్తే మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని సూచిస్తున్నారు.

రంగంలోకి సీనియర్లు
ఎడప్పాడి పళనిసామి వర్గంలోని ఎమ్మెల్యేలతో పన్నీర్ సెల్వం వర్గంలోని సీనియర్లు మంతనాలు జరుపుతున్నారు. పన్నీర్ సెల్వం వర్గం నుంచి వస్తున్న ప్రతిపాదనలకు ఎడప్పాడి వర్గంలోని ఎమ్మెల్యేలు సానుకూలంగా స్పందిస్తున్నారని స్పష్టంగా కనపడుతోంది.

చర్చలు విఫలం అయితే
అన్నాడీఎంకే వర్గాల విలీనం కోసం జరుపుతున్న చర్చలు విఫలం అయ్యాయి. అయితే బుధవారం పన్నీర్ సెల్వం వర్గం మరో బాంబు పేల్చింది. తాము చర్చలకు సిద్దంగానే ఉన్నామని పన్నీర్ సెల్వం వర్గంలోని సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కేపి మునిసామి ఎడప్పాడి పళనిసామి వర్గానికి సంకేతాలు ఇచ్చారు.

ఇప్పట్లో చర్చలు లేవు
బుధవారం మీడియాతో మాట్లాడిన కేపి మునిసామి తాము విలీనం విషయంలో చర్చించడానికి ఓ ప్రత్యేక కమిటీ వేస్తున్నామని స్పష్టం చేశారు. అయితే ఇప్పట్లో ఎడప్పాడి పళనిసామి వర్గంతో చర్చలు ఉండవని వెంటనే బాంబు పేల్చారు.

ఎమ్మెల్యే జంప్
ఎడప్పాడి పళనిసామి వర్గంలోని ఎమ్మెల్యే, శశికళకు అత్యంత సన్నిహితుడు అయిన ఎమ్మెల్యే రాజశేఖరన్ బుధవారం పన్నీర్ సెల్వం వర్గంలో చేరిపోయారు. పుదుకోటై శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే అయిన రాజశేఖరన్ ఎలాంటి షరతులు లేకుండా పన్నీర్ సెల్వం గూటికి చేరారు.

సీఎం ఎడప్పాడికి చెమటలు
ఎమ్మెల్యే రాజశేఖరన్ మీడియాతో మాట్లాడుతూ తనలాగే ఇంకా కొంత మంది ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం వర్గంలో చేరడానికి సిద్దంగా ఉన్నారని బాంబు పేల్చారు. పన్నీర్ సెల్వం వర్గం నిజమైన అన్నాడీఎంకే పార్టీ అంటూ ఎడప్పాడి పళనిసామికి ఝలక్ ఇచ్చారు.

పన్నీర్ సెల్వం వర్గంలో 13 మంది ఎమ్మెల్యేలు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గంలో 13 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎంపీలు ( రాజ్యసభ సభ్యుడు ఒకరు) ఉన్నారు. త్వరలో మరికొందరు ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం వర్గంలో చేరితే ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం కుప్పకూలిపోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications