ప్రతీకారం తీర్చుకోవాలి: పుల్వామా అమరజవాన్ల కుటుంబాలు, ఢిల్లీ పాక్ ఎంబసీ వద్ద నిరసన
న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్లోని పుల్వామా తీవ్రవాద దాడి ఘటనపై యావత్ భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నలబై మందికి పైగా జవాన్లు మృతి చెందారని, అందుకు ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం అమర జవాన్ల కుటుంబాలు కూడా ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్ చేశాయి.
జంతర్ మంతర్ వద్ద హిందూ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో టెర్రరిస్ట్ దాడిపై ఆందోళన వ్యక్తం చేశారు. జవాన్లకు నివాళులు అర్పించారు. తీవ్రవాదానికి, మద్దతిస్తున్న పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాడి చేసిన వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. అమర జవాన్ల కుటుంబాలు కూడా ఈ నిరసనలో పాల్గొన్నాయి. ప్రతీకారం తీర్చుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆ తర్వాత వారు ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీ వద్ద నిరసన తెలిపారు.
అవకాశం వస్తే భరతమాత కోసం తమ కొడుకులందరినీ త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మధ్యప్రదేశ్లోని కుదవాల్ సిహోరా గ్రామస్థులు అన్నారు. ఈ గ్రామానికి అశ్విన్ కచ్చి నిన్న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అతని మృతి తమను బాధించిందని, కానీ దేశం కోసం అమరుడైనందుకు గర్విస్తున్నామని చెప్పారు. మా గ్రామానికి చెందిన దాదాపు ముప్పై మంది సైన్యంలో ఉన్నారని, అవకాశం వస్తే మాతృభూమి కోసం మా కొడుకులందరినీ త్యాగం చేస్తామన్నారు.
ఎన్ఐఏ నివేదిక
పుల్వామా దాడి ఘటనపై ఎన్ఐఏ నివేదిక ఇచ్చింది. ఉగ్రవాద దాడిలో ఆర్డీఎక్స్ వాడలేదని ఈ నివేదిక వెల్లడించింది. పేలుడుకు యూరియా అమ్మోనియం నైట్రేట్ను వాడినట్లుగా గుర్తించారు. క్వారీల్లో పెద్ద పెద్ద రాళ్లను పగులగొట్టేందుకు ఉపయోగించే యూరియా అమ్మోనియం నైట్రేట్ను ఉగ్రవాదులు వాడారు.