సచినే దిక్కు.. : లేదంటే ఆయన ఇంటిముందే దీక్ష
ముంబై : సెలబ్రిటీలు ఇచ్చే ప్రకటనలు చూసి ముందు వెనుకా ఆలోచించకుండా ఆయా ఉత్పత్తులను కొనేస్తుంటారు కొంతమంది. బ్రాండ్ అంబాసిడర్లను చూసి కొనుగోలు చేసిన సదరు బ్రాండ్లు వినియోగంలో తేలిపోవడంతో, వెంటనే ఫిర్యాదుల బాట పడుతుంటారు. ఇదే తరహాలో ప్రముఖ క్రికెటర్ సచిన్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన అమిత్ ఎంటర్ ప్రైజెస్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ద్వారా తన భూమిని విక్రయించిన సందీప్ అనే ఓ ల్యాబ్ టెక్నీషియన్,, కంపెనీ యాజమాన్యం తనను మోసం చేసిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అంతేకాదు.. తనకు న్యాయం జరగకపోతే బాంద్రాలోని సచిన్ ఇంటి ఎదురుగా మే 18 నుంచి నిరాహార దీక్షకు కూడా దిగుతానని హెచ్చరిస్తున్నాడు. ఇంతకీ అసలు విషయమేంటంటే..! పుణేలో సందీప్ కు వారసత్వంగా సంక్రమించిన భూమిని, ఆయన మామ శివాజీ పింజన్ అంగీకారంతో నాలుగేళ్ల క్రితం అప్పటి మార్కెట్ రేటు ప్రకారం రెండు కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది అమిత్ ఎంటర్ ప్రైజెస్.
ఇందులో సందీప్ కి 20 లక్షలు చెల్లించిన అమిత్ ఎంటర్ ప్రైజెస్, తన మామ శివాజీ కూడా ఆస్తిలో వాటా కలిగి ఉండడంతో ఆయనకు కోటి 50 లక్షలు చెల్లించింది. దీంతో తనకు అన్యాయం జరిగిందని వాపోతున్న సందీప్, 'సచిన్ మానవతావాది, ఇతరులకు సహాయం చేయడానికి ముందుండే ఆయన అమిత్ ఎంటర్ ప్రైజెస్ నుంచి తనకు న్యాయం జరిగేలా చూడాలని' డిమాండ్ చేస్తున్నాడు.
లేని పక్షంలో కుటుంబంతో కలిసి సచిన్ ఇంటిముందు దీక్షకు దిగుతానని హెచ్చరిస్తున్నాడు. ఈ మేరకు బాంద్రా పోలీసులకు లేఖ రాసిన సందీప్, దీక్ష సందర్భంగా తమకు రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను కోరాడు. మరోవైపు సందీప్ వ్యవహారంపై స్పందించిన అమిత్ ఎంటర్ ప్రైజెస్.. తమపై చేస్తోన్న ఆరోపణలను ఖండించింది.
సందీప్ తల్లి రంజనా, ఆస్తి హక్కులను తన తమ్ముడైన శివాజీ పేరు మీదకు మార్పిడి చేశారని, ఆమె భర్త సమక్షంలోనే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా జరిగిందని తెలిపింది. శివాజీ ఆ డీడ్ సమర్పించడంతో, సంబంధిత శాఖ నుంచి వివరాలు సేకరించి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే భూమిని కొనుగోలు చేశామని సంస్థ అధికారులు చెప్తున్నారు.
శివాజీ నుంచి కోటి 50 లక్షల ఒప్పందం మేరకు భూమిని కొనుగోలు చేశామని, ఆయన కోరిక మేరకు తన చెల్లెలు రంజనాకు కూడా 20 లక్షలు చెల్లించామని తెలిపింది యాజమాన్యం. మరో ట్విస్ట్ ఏంటంటే.. అసలు సచిన్ కు తమ కంపెనీతో సంబంధం లేదని సచిన్ తో ఒప్పందం 2000-2014 లోనే ముగిసిపోయిందని పేర్కొన్నారు.