కేతన్ హత్యకు ముందు రిహార్సల్స్.. ఎవరు తోశారో ఆధారాల్లేవు!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పూణేలో తీవ్ర సంచలనంగా మారిన రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో ఊహించని ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. లోహగఢ్ కోట పైనుంచి కేతన్ను లోయలోకి నెట్టింది ఎవరు అన్నది పోలీసులకు అంతు చిక్కకుండా ఉంది.
సియాకు 'లై-డిటెక్టర్' పరీక్ష చెయ్యాలని కోర్టును కోరిన పోలీసులు
ఈ విషయానికి సంబంధించి తమ వద్ద ఎలాంటి ప్రత్యక్ష సాక్ష్యాలు లేదా ఖచ్చితమైన ఆధారాలు లేవని పుణే పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సియా పోలీసులకు సహకరించటం లేదు. దీంతో పోలీసులు నిందితురాలు సియా గోయల్పై 'లై-డిటెక్టర్' పాలిగ్రాఫ్ పరీక్షను నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని పుణే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

నిందితుల అనుమతి లేనిదే పాలిగ్రాఫ్ పరీక్షలు చేయకూడదన్న సియా న్యాయవాది
నిందితులైన సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరిల స్టేట్మెంట్లను ఇప్పటికే రికార్డు చేసినప్పటికీ, విచారణను మరింత ముందుకు తీసుకెళ్లడానికి మరియు కొత్త ఆధారాలను సేకరించడానికి ఈ పాలిగ్రాఫ్ పరీక్ష ఎంతో అవసరమని పోలీసులు కోర్టులో వాదించారు. మరోవైపు, సియా తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఇటువంటి పరీక్షలు నిర్వహించడానికి నిందితుల ముందస్తు అనుమతి తప్పనిసరని, దీనికి కొన్ని చట్టపరమైన, సాంకేతిక ప్రక్రియలు పూర్తి కావాల్సి ఉందని పేర్కొన్నారు.
కేతన్ మొబైల్ లో చాట్ డిలీట్ చేసిందా.. దర్యాప్తు
ఈ దర్యాప్తులో భాగంగా జూన్ 18న జరిగిన ఈ ఘోర హత్యకు కొద్ది నిమిషాల ముందు సియా.. కేతన్ మొబైల్ ఫోన్ను తన చేతిలోకి తీసుకుందని, ఆ తర్వాత దానిని అతని బంధువులకు అప్పగించిందని పోలీసులు గుర్తించారు. ఈ లోపు మొబైల్లోని కీలకమైన డిజిటల్ సాక్ష్యాలను లేదా చాట్లను ఆమె డిలీట్ చేసిందా అనే కోణంలో ఫోరెన్సిక్ నిపుణులు దర్యాప్తు చేస్తున్నారు.
హత్యకు ముందు నిందితులు రిహార్సల్స్
ఇప్పటికే పోలీసులు లోహగఢ్ కోట వద్ద నిందితులతో క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. మరోవైపు కేతన్ అగర్వాల్ హత్యకు ముందు కోటపై నుండి తోసేయడానికి నిందితులు రిహార్సల్స్ చేసినట్టు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. దీంతో నేడు పోలీసులు సియాను రిహార్సల్స్ చేసిన ప్రదేశాన్ని గుర్తించేందుకు తీసుకువెళ్లారు.













Click it and Unblock the Notifications