అధికారం కోసం అర్రులు: బీజేపీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి
చండీగఢ్: శాసన సభ ఎన్నికల నేపథ్యంలో- ఊహించినట్టే పంజాబ్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన ఈ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపాగా వేయడానికి ప్రత్యర్థి పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కొత్త ఎత్తుగడలను వేస్తోన్నాయి. వరుసగా రెండోసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కకుండా చేయడానికి భిన్న ధృవాల్లాంటి పార్టీలు సైతం ఒకే గూటికి చేరుకుంటున్నాయి. పొత్తులతో కూటమి కడుతున్నాయి.
కాంగ్రెస్కు గుడ్బై చెప్పిన సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్.. కొత్త పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో ఏర్పాటైన ఈ పార్టీ వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోదలిచిన పార్టీల పేర్లను వెల్లడించింది. బీజేపీ, సుఖ్దేవ్ సింగ్ ధిండ్సాకు చెందిన శిరోమణి అకాలీ దళ్ సంయుక్త్తో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనుంది. ఈ విషయాన్ని అమరీందర్ సింగ్ వెల్లడించారు. ఈ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని స్పష్టం చేశారు.
కొద్దిసేపటి కిందటే ఆయన చండీగఢ్లో విలేకరులతో మాట్లాడారు. ఈ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకోనున్నామని, త్వరలోనే సీట్లను సర్దుబాటు చేసుకుంటామని అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి ఉమ్మడిగా పని చేస్తామని చెప్పారు. భావసారూప్యం గల పార్టీలు వస్తే ఆహ్వానిస్తామని వ్యాఖ్యానించారు. త్వరలోనే ఉమ్మడిగా బహిరంగ సభలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసి ప్రచార కార్యక్రమాలను రూపొందిస్తామని అమరీందర్ సింగ్ చెప్పారు.
నిజానికి- పంజాబ్లో బీజేపీ-శిరోమణి అకాలీదళ్ మధ్య పొత్తు ఉండేది. మూడు వ్యవసాయ చట్టాలను ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ గత ఏడాది అకాలీదళ్ ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగింది. అప్పటి నుంచి పంజాబ్లో పొత్తు పార్టీ కోసం ఎదురు చూస్తోంది బీజేపీ. అదే సమయంలో అమరీందర్ సింగ్ను కాంగ్రెస్ అధిష్ఠానం ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడం, ఆ వెంటనే ఆయన పార్టీకి రాజీనామా చేయడం జరిగిపోయాయి. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీని ఆయన నెలకొల్పారు.
పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ-బీజేపీ-శిరోమణి అకాలీదళ్ సంయుక్త్ కూటమిని కాంగ్రెస్ పార్టీ ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తిగా మారింది. వరుసగా రెండోసారి అధికారంలోకి రావడానికి ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ ఛన్నీ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తోంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధు-చరణ్జిత్ సింగ్ ఛన్నీ కాంబినేషన్ పార్టీని మరోసారి గెలిపిస్తుందని కాంగ్రెస్ ఆశిస్తోంది.