దేశాన్ని సాకిన గడ్డపై రోజూ రాత్రి సాగే క్యాన్సర్ ప్రయాణం!
రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయం. ఆ రైల్వే స్టేషన్లో నిశ్శబ్దం వాతావరణం. ప్లాట్ఫామ్పై డిమ్లైట్ల కాంతిలో వందలాది మంది ప్రయాణికులు ఎదురుచూస్తుంటారు. వారి చేతుల్లో చిన్న చిన్న మూటలు, ప్లాస్టిక్ కవర్లలో మెడికల్ రిపోర్టుల కాగితాలు. ఎవరి ముఖంలో చూసినా భయం, వేదన, అదే సమయంలో ఏదో తెలియని ఆశ. 12 భోగీలతో వచ్చే ఆ రైలు ఎక్కడానికి వీరంతా సిద్ధమవుతారు. పైకి అది సాధారణ రైలే కావచ్చు.. కానీ స్థానికంగా దాని పేరు మాత్రం 'క్యాన్సర్ రైలు'.
325 కిలోమీటర్ల ప్రయాణం.. ఒకే ఒక ఆశ
పంజాబ్లోని భటిండా నుంచి రాజస్థాన్లోని బికనేర్కు వెళ్లే ఈ రైలు ప్రతీ రాత్రి వందలాది మంది క్యాన్సర్ బాధితులకు జీవనాధారంగా మారింది. ఈ బండిలో ప్రయాణించే వారిలో దాదాపు మూడోవంతు మంది రాజస్థాన్లోని ఆచార్య తులసి క్యాన్సర్ ఆస్పత్రికి వెళ్లే బాధితులు, వారి బంధువులే ఉంటారు. తెల్లవారుజామున 6 గంటలకు బికనేర్ చేరుకునే ఈ 325 కిలోమీటర్ల ప్రయాణంలో ఎన్నో కన్నీటి గాథలు ఉంటాయి. రైలు ఆలస్యమైనా వారి ఆశ మాత్రం సడలదు. పంజాబ్ ప్రభుత్వం క్యాన్సర్ బాధితులకు ఉచిత ప్రయాణ సదుపాయం, వారి సహాయకులకు 75 శాతం టికెట్ మినహాయింపు ఇవ్వడంతో పాటు బికనేర్ ఆస్పత్రుల్లో ఆర్థిక సాయం అందుతుండటంతో పేద రోగులకు ఈ రైలే దిక్కవుతోంది.

పసిడి పంటల నేలలో.. విషపు రసాయనాలు!
దేశానికే అన్నపూర్ణగా నిలిచి, ఆహార ధాన్యాల కొరతను తీర్చిన పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఈ స్థాయిలో క్యాన్సర్ విస్తరించడానికి కారణమేంటి? దీనికి మూలాలు అరవై ఏళ్ల కిందటి 'హరిత విప్లవం'లో ఉన్నాయి. దిగుబడి పెంచడమే లక్ష్యంగా ఇష్టారాజ్యంగా వాడిన రసాయన ఎరువులు, పురుగుమందులే నేడు ప్రాణాంతకంగా మారాయి. పంజాబ్ ఏటా వేలాది టన్నుల క్రిమిసంహారకాలను వాడుతూ దేశంలోనే అత్యధిక రసాయనాలు ఉపయోగించే ప్రాంతంగా మారింది. ఫలితంగా అక్కడి భూగర్భ జలాలు, తాగే నీరు, పండించే పంటలు.. పీల్చే గాలి.. చివరికి పాలు కూడా విషతుల్యమయ్యాయి. భూమిలో ఆర్సెనిక్, యురేనియం వంటి భార లోహాలు కలవడం పరిస్థితిని మరింత దిగజార్చింది.
తరతరాలను మింగేస్తున్న మహమ్మారి
విపరీతమైన రసాయనాల ప్రభావం వల్ల మనుషుల్లో రోగనిరోధక శక్తి దెబ్బతిని, కణాలు ఒక్కసారిగా పెరగడం ద్వారా క్యాన్సర్ మహమ్మారి దాడి చేస్తోంది. చివరికి తల్లుల పాలల్లో, ఆవు పాలల్లో కూడా ప్రమాదకర పురుగుమందుల అవశేషాలు ఉన్నట్లు పరిశోధనల్లో తేలడం గమనార్హం. ఒకప్పుడు పసిడి పంటలతో కళకళలాడిన పల్లెలు ఇప్పుడు ప్రతీ ఇంట్లో ఒక క్యాన్సర్ బాధితుడితో విలవిలలాడుతున్నాయి. వైద్యం కోసం కుటుంబాలకు కుటుంబాలు ఆస్తులు అమ్ముకుని అప్పులపాలవుతున్నాయి.
పరిష్కారం దిశగా అడుగులు పడేనా?
రసాయన రహిత వ్యవసాయం, సమీకృత సస్యరక్షణ పద్ధతులను ప్రోత్సహించడమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం. వాతావరణాన్ని, మనుషుల ఆరోగ్యాన్ని దెబ్బతీయని ప్రకృతి సాగు వైపు రైతులను మళ్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆధునిక వ్యవసాయం పేరుతో నేలను, నీటిని విషమయం చేసుకున్న ఫలితాన్ని ఈ రోజు మానవాళి అనుభవిస్తోంది. భటిండా స్టేషన్లో రాత్రిపూట కదిలే ఆ రైలు కేవలం ప్రయాణికులను మోసుకెళ్లడం లేదు.. మనం చేసిన తప్పులను, ప్రకృతి మనకు ఇస్తున్న హెచ్చరికలను గుర్తు చేస్తూ సాగిపోతోంది. కోలుకున్న వారు ప్రాణాలతో తిరుగు ప్రయాణమవుతుంటే... చనిపోయిన వారి శవాలతో ఈ రైలు కన్నీటి కథలతో చివరి ప్రయాణం చేస్తుంది.












Click it and Unblock the Notifications