మీటూ వేధింపులు: అలాంటి వ్యక్తికి సీఎం పదవా? రాజీనామా చేయండి: జాతీయ మహిళా కమిషన్
న్యూఢిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది గంటల్లోనే చరణ్జిత్ సింగ్ చన్నీకి జాతీయ మహిళా కమిషన్ నుంచి తీవ్ర హెచ్చరిక జారీ అయ్యింది. సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీపై మీటూ ఆరోపణలు నిజమని తేలితే ఆయన తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ డిమాండ్ చేశారు. వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీకి చురకలంటించింది.
పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్జిత్ సింగ్ చన్నీ నియామకం కావడం సిగ్గుచేటు, తీవ్ర అభ్యంతరకరం. ఓ ఐఏఎస్ అధికారిణికి అసభ్యకర సందేశాలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కావడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇలాంటి వేధింపులు మరో మహిళకు జరగకూడదని కోరుకుంటున్నాం. తనపై వచ్చిన ఆరోపణలకు బాధ్యత వహిస్తూ చరణ్జిత్ సింగ్ చన్నీ సీఎం పదవికి రాజీనామా చేయాలని జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ డిమాండ్ చేశారు.
ఓ మహిళా ఐఏఎస్ అధికారికే న్యాయం జరగకుంటే రాష్ట్రంలో మహిళలకు భద్రత ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని ఘాటుగా స్పందించారు. ఉన్నతాధికారులకే వేధింపులు ఎదురైతే.. సాధారణ మహిళలకు రక్షణ కల్పిస్తామని కాంగ్రెస్ ఎలా భరోసా ఇవ్వగలదని నిలదీశారు. ఓ మహిళగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రికి చరణ్జిత్ సింగ్ చన్నీపై మీటూ ఆరోపణలు కనిపించలేదా? అని సోనియా గాంధీ పేరు ప్రస్తావించకుండా ప్రశ్నించారు.
కాగా, 2018లో మహిళా ఐఏఎస్ అధికారికి అసభ్యకరమైన మెసేజ్లు పెట్టారంటూ చరణ్జిత్ సింగ్ చన్నీపై ఆరోపణలున్నాయి. అప్పట్లో ఈ అంశం తీవ్ర దుమారం రేపింది. అయితే, అప్పటి సీఎం అమరీందర్ సింగ్ జోక్యంతో వివాదం కాస్త సద్దుమణిగినట్లే కనిపించింది. ఆ ఆరోపణలపై విచారణ చేపట్టినట్లు రాష్ట్ర మహిళా కమిషన్ కూడా తెలిపింది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ రాష్ట్ర ముఖ్య కార్యదర్శికి లేఖ రాసినట్లు పంజాబ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ మనీషా గులాటీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో చరణ్జిత్ సింగ్ చన్నీని ముఖ్యమంత్రిని చేయడం వివాదాస్పదంగా మారింది. బీజేపీ సహా పలు పార్టీలు కూడా ముఖ్యమంత్రి నియామకంపై మండిపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి దళితులపై నమ్మకం లేదని, రాజకీయ అవసరాలు, త్వరలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుందని విమర్శిస్తున్నాయి.
పంజాబ్ 16వ ముఖ్యమంత్రిగా చరణ్జిత్ సింగ్ చన్నీ ప్రమాణం
ఛండీగఢ్: పంజాబ్ 16వ ముఖ్యమంత్రిగా దళిత నేత చరణ్జిత్ సింగ్ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ చన్నీతో ప్రమాణం చేయించారు. అనంతరం కాంగ్రెస్ నేతలు సుఖిందర్ ఎస్ రంధ్వానా, ఓపీ సోని ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పంజాబ్ వ్యవహారాల బాధ్యునిగా ఉన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హరీశ్ రావత్, రాష్ట్ర పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ హాజరయ్యారు. ప్రమాణస్వీకారానికి ముందు చరణ్జిత్ సింగ్ చన్నీ గురుద్వారాను దర్శించుకున్నారు. ఆ తర్వాత సీనియర్ నేత హరీశ్ రావత్ తో కలిసి రాజ్భవన్ చేరుకున్నారు.
కొత్త ముఖ్యమంత్రికి రాహుల్, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ శుభాకాంక్షలు తెలిపారు. పంజాబ్ తొలి దళిత ముఖ్యమంత్రిగా చరణ్జీత్ సింగ్ చన్నీనే కావడం గమనార్హం. చన్నీ పంజాబ్ మాల్వా బెల్డ్లో రూప్నగర్ జిల్లాలోని చామ్కౌర్ సాహిబ్ అసెంబ్లీ స్థానం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. చరణ్జీత్ అంతకుముందు అమరీందర్ సింగ్ కెబినేట్లో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు.
కాగా, మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రాజీనామా చేసిన 24 గంటల్లోనే కాంగ్రెస్ అధిష్టానం కొత్త ముఖ్యమంత్రిని ఖరారు చేసింది. ముందు సుఖ్జీందర్ సింగ్ అని వార్తలు వచ్చినా.. కాసేపటికే చరణ్జీత్ సింగ్ పేరును అధిష్టానం ప్రకటించింది. పలు పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ.. పంజాబ్ సీఎంగా ఈసారి ఎస్సీ నేతకు అవకాశం కల్పిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. అయితే, చరణ్ జిత్ సింగ్ చన్నీ దళితుడు కాదని, అతడు క్రిస్టియన్ అని, ఇప్పటికే రాష్ట్రంలోని అనేక మంది హిందువులు, సిక్కులను క్రిస్టియన్లుగా మార్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Recommended Video
మరోవైపు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చన్నీ సోమవారం మధ్యాహ్నం మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ను కలవనున్నట్లు తెలిసింది. చన్నీని కెప్టెన్ అమరీందర్ సింగ్ భోజనానికి ఆహ్వానించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కొత్త సీఎంతోపాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా మాజీ సీఎం ఇంటికి వెళ్లనున్నట్లు సమాచారం. పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చరణ్జిత్ సింగ్ చన్నీకి ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. పంజాబ్ రాష్ట్ర ప్రజల పురోగతి కోసం నూతన ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని మోడీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఇది ఇలావుంటు. మరో కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్లోనూ ముఖ్యమంత్రి మార్పు కోరుతూ పార్టీ నేతలు నిరసనకు దిగుతుండటం గమనార్హం. ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ను సీఎం పదవి నుంచి దించి.. మరో కీలక నేత సచిన్ పైలట్కు ముఖ్యమంత్రిగా నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.