నేతల్లో రిజల్ట్స్ టెన్షన్: గరంగరం జిలేబీలు రెడీ చేసిన కేజ్రీవాల్: గురుద్వారాలో ముఖ్యమంత్రి
న్యూఢిల్లీ: దేశ ప్రజలు ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తూ వస్తోన్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవ్వాళ వెలువడనున్నాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం ఇంకొన్ని గంటల్లో బహిర్గతం కానుంది. ఈ అయిదింట్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. గోవా, ఉత్తరాఖండ్లల్లో బీజేపీ-కాంగ్రెస్ మధ్య పోటాపోటీ ఉంటుందంటూ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేసిన నేపథ్యంలో- అక్కడ నంబర్ గేమ్ మొదలైంది.
పంజాబ్లో ఆమ్ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ- ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడం.. కాంగ్రెస్కు గుబులు పుట్టిస్తోంది. అసెంబ్లీ ఫలితాలు వెలువడనున్న అయిదింట్లో- కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రం ఇదొక్కటే. ఇప్పుడీ రాష్ట్రం కాంగ్రెస్ చేతుల్లో నుంచి జారిపోవడం ఖాయమనే అభిప్రాయాలు ఉన్నాయి. ప్రతిపక్ష స్థానానికే పరిమితమౌతుందంటూ ఎగ్జిట్ పోల్స్ తేల్చిచెప్పాయి. ఇది కాస్తా కాంగ్రెస్ పార్టీని ఆందోళనల్లోకి నెట్టింది.
పంజాబ్ అసెంబ్లీలో ఉన్న సీట్ల సంఖ్య 117. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 59. దీన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అందుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. 60 నుంచి 67 సీట్లను సాధిస్తుందని తేల్చాయి. అధికారంలోకి రావడానికి అవసరమైనన్ని స్థానాలకు కాంగ్రెస్ ఆమడదూరంలో నిలుస్తుందని, 40 నుంచి 50 సీట్లకు పరిమితమౌతుందంటూ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. దీనితో కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ మొదలైంది.
ఈ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ ఛన్నీ- గురుద్వారాను సందర్శించారు. రోపర్లోని కతల్గఢ్ శ్రీగురుద్వారాలో ప్రార్థనలు చేశారు. కొద్దిమంది అనుచరులు, పార్టీ నాయకులతో కలిసి గురుద్వారాకు చేరుకున్నారు. కమిటీ ప్రతినిధులు ఆయనకు సాదరంగా ఆహ్వానించారు. సుమారు అరగంట పాటు అక్కడే గడిపారు ఛన్నీ. అనంతరం తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. ఎగ్జిట్పోల్స్ అంచనాలను తాను విశ్వసించట్లేదని పేర్కొన్నారు. ఈవీఎంలు ప్రజాభిప్రాయానికి ప్రతీకగా నిలుస్తాయని వ్యాఖ్యానించారు.
Recommended Video
మరోవంక- పంజాబ్లో అధికారంలోకి రావడం ఖాయమంటూ స్పష్టమైన నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్లో జోష్ కనిపిస్తోంది. ఆ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున విజయోత్సవాలను జరుపుకోవడానికి సిద్ధపడుతున్నారు. జిలేబీలను సిద్ధం చేశారు. పార్టీ కార్యాలయాలను ముస్తాబు చేశారు. పూలతో అలంకరించారు. బాణాసంచాలను రెడీగా ఉంచుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీకి మాత్రమే పరిమితమైన ఆమ్ ఆద్మీ పార్టీ- తన పరిధిని విస్తరించుకున్నట్టవుతుంది.