కెప్టెన్లో డబుల్ సంతోషం: అమరీందర్ 'బర్త్ డే' గిఫ్ట్గా కాంగ్రెస్ విజయం
మొత్తం మీద కాంగ్రెస్ గెలుపు అందరికన్నా ఎక్కువ సంతోషానిచ్చింది పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కే. ఫలితాలు వెలువడ్డ రోజే ఆయన పుట్టినరోజు కావడంతో.. ఆయనలో డబుల్ సంతోషం కనిపిస్తోంది.
చండీఘర్: పంజాబ్ లో కాంగ్రెస్-ఆప్ మధ్య హోరాహోరీ పోరు తప్పదని అటు ఎగ్జిట్ పోల్స్ తో పాటు ఇటు పలువురు విశ్లేషకులు సైతం అంచనా వేశారు. దానికి తోడు ఎన్నికలకు ముందు ఆప్ లో ఉన్న ధీమా చూసినవారంతా.. పంజాబ్ లో ఆ పార్టీ సత్తా చాటడం ఖాయమని భావించారు.
కానీ కౌంటింగ్ ప్రారంభమయ్యాక సీన్ తలకిందులైంది. తొలి దశలో కొద్దిసేపు ఆప్ ప్రదర్శించిన ఆధిక్యం కొంతమేరకే పరిమితమైంది. ఆ తర్వాత కాంగ్రెస్ దూకుడు ముందు ఆప్ నిలవలేకపోయింది. మొత్తం 117స్థానాలకు 59 మేజిక్ ఫిగర్ కాగా.. ఇప్పటికే 79స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం దిశగా కాంగ్రెస్ దూసుకెళ్తోంది.
మొత్తం మీద కాంగ్రెస్ గెలుపు అందరికన్నా ఎక్కువ సంతోషానిచ్చింది పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కే. ఫలితాలు వెలువడ్డ రోజే ఆయన పుట్టినరోజు కావడంతో.. ఆయనలో డబుల్ సంతోషం కనిపిస్తోంది. కాగా, లంబి, పాటియాల స్థానం నుంచి పోటీ చేసిన అమరీందర్ సింగ్.. లంబిలో సీఎం ప్రకాశ్ బాదల్ పై ఓటమిపాలవగా.. పాటియాలలో ప్రత్యర్థి జేజే సింగ్ పై 51వేల మెజారిటీ విజయం సాధించారు.
117 స్థానాలున్న పంజాబ్లో కాంగ్రెస్ 75, అకాలీదళ్-భాజపా కూటమి 18, ఆప్ 20, ఇతరులు మూడు స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తం మీద వరుసగా మూడోసారి అధికారం చేజిక్కుంచుకోవాలన్న అకాలీ ఆశలకు గండి కొడుతూ.. పదేళ్ల తర్వాత పంజాబ్ లో కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టబోతుంది.