హార్రర్..లాక్డౌన్: నడిరోడ్డుపై కత్తులతో వీరంగం: సిలిండర్తో పేలుడుకు: ఎస్ఐ చేతులు నరికివేత
చండీగఢ్: పంజాబ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. లాక్డౌన్ విధుల్లో ఉంటోన్న కొందరు పోలీసు అధికారులపై ఏడుమంది నిహంగ సామాజిక వర్గానికి చెందిన సిక్కులు వీరంగం సృష్టించారు. కత్తులతో దాడి చేశారు. ఓ పోలీసు అధికారి రెండు చేతులను నరికి వేశారు. మరో ముగ్గురు కానిస్టేబుళ్లను గాయపరిచారు. కత్తులతో దాడి చేసిన మూకపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరికి బుల్లెట్ గాయాలు అయ్యాయి. పంజాబ్లోని పటియాలాలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
పటియాలా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ హర్జీత్ సింగ్ ఈ ఉదయం కూరగాయల మార్కెట్ వద్ద లాక్డౌన్ డ్యూటీలో ఉన్నారు. ఆయనతో పాటు మరో ముగ్గురు కానిస్టేబుళ్లు పహారా కాస్తున్న సమయంలో నిహంగ సామాజిక వర్గానికి చెందిన ఏడుమంది సిక్కులు మార్కెట్ వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో వారంతా గుంపుగా ఉండటం, ముఖానికి మాస్కులు కూడా లేకుండా లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించడంతో హర్జీత్ సింగ్ వారిని అడ్డుకున్నారు.
లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే భారీ జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వారి వద్ద కత్తులు, గ్యాస్ సిలిండర్ ఉండటాన్ని గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. దీనితో వారు హఠాత్తుగా పోలీసులపై దాడికి పాల్పడ్డారు. తమ వెంట తెచ్చుకున్న కత్తులతో హర్జిత్ సింగ్పై దాడి చేశారు. ఆయన రెండు చేతులను నరికి వేశారు. అక్కడే డ్యూటీలో ఉన్న మరో ముగ్గురు కానిస్టేబుళ్లపై దాడి చేశారు. వారిని గాయపరిచి, పారిపోయారు.
ఈ సమాచారం అందుకున్న వెంటనే మిగిలిన పోలీసు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. నిహంగా సిక్కుల కోసం గాలించారు. నిహంగా గురుద్వారా సమీపంలో వారు వెళ్తున్నట్లు తెలిసిన వెంటనే వారిని వెంబడించారు. కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడాగా.. మిగిలిన ఆరుమంది తప్పించుకుని పారిపోయారు. నిహంగా సిక్కుల దాడిలో హర్జిత్ సింగ్ గాయపడ్డారని, ఆయనకు శస్త్రచికిత్స నిర్వహిస్తున్నట్లు పంజాబ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ దినకర్ గుప్తా తెలిపారు.