కాంగ్రెస్కు అచ్ఛేదిన్: కొట్టుకుని పోయిన బీజేపీ: అడ్రస్ గల్లంతు: హస్తానికి కళ్లు చెదిరే మెజారిటీ
చండీగఢ్: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ చట్టాలపై నెలకొన్న వ్యతిరేకత దెబ్బ ఏపాటిదో భారతీయ జనతా పార్టీకి తెలిసి వచ్చినట్టుంది. పంజాబ్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అడ్రస్ గల్లంతయింది. వ్యతిరేక పవనాల్లో కమలం కొట్టుకునిపోయింది. కాంగ్రెస్ కళ్లు చెదిరే విజయాన్ని అందుకుంటోంది. ఏ ఒక్క మున్సిపాలిటీలోనూ బీజేపీ ఖాతా తెరవని పరిస్థితి నెలకొని ఉందంటే.. మూడు వ్యవసాయ చట్టాలపై అక్కడి రైతుల్లో నెలకొన్న ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మున్సిపల్ కార్పొరేషన్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్
పంజాబ్లో ఎనిమిది మున్సిపల్ కార్పొరేషన్లు, 109 మున్సిపాలిటీలకు ఈ నెల 14వ తేదీన నిర్వహించిన ఎన్నికల ఫలితాలు ప్రస్తుతం వెలువడుతున్నాయి. 71 శాతానికి పైగా పోలింగ్ శాతం నమోదైనప్పుడే బీజేపీకి ఓటమి తప్పకపోవచ్చనే అంచనాలు వెలువడ్డాయి. దానికి అనుగుణంగా అనేక చోట్ల బీజేపీ అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయాన్ని అందుకుంటున్నారు. అనేక డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో ముందంజలో కొనసాగుతోన్నారు. మోగ, హోషియార్పూర్, కపుర్తలా, అబొహర్, పఠాన్కోట్, బటాలా, భటిండా మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ హవా వీస్తోంది.

బీజేపీ మిత్రపక్షానిదీ అదే దుస్థితి..
కేంద్ర మాజీమంత్రి, మొన్నటిదాకా ఎన్డీఏ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ నాయకురాలు హర్సిమ్రత్ కౌర్ బాదల్ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న భటిండా లోక్సభ నియోజకవర్గంలోని కాంగ్రెస్ భారీ ఆధిక్యాన్ని సాధించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. శిరోమణి అకాలీదళ్కు ఈ నియోజకవర్గం కంచుకోట. అలాంటి చోట నిర్వహించిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ రెండో స్థానానికి పరిమితం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అలాంటి పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోబోతోంది.

కనీస ప్రతిఘటన ఇవ్వలేక
నిజానికి- పంజాబ్ ముందు నుంచీ కాంగ్రెస్కు అండగా ఉంటూ వస్తోంది. ఇప్పుడు కూడా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేప్టెన్ అమరీందర్ సింగ్ ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత కొద్దో, గొప్పో ఉంటుందని, బీజేపీ గట్టిపోటీని ఇవ్వడమో లేక మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను గెలుచుకోవడమో జరుగుతుందనే అంచనాలు వెలువడినప్పటికీ.. వాస్తవ ఫలితాలు మాత్రం దీనికి భిన్నంగా ఉంటోన్నాయి. ఎనిమిది మున్సిపల్ కార్పొరేషన్లలో ఏడు చోట్ల కాంగ్రెస్ ఘన విజయాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉంది.

బీజేపీ ఊసే లేకుండా..
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఊసే లేకుండా పోవడానికి ప్రధాన కారణం.. మూడు వ్యవసాయ చట్టాల ప్రభావమేననేది బహిరంగ రహస్యమే. సుదీర్ఘకాలం పాటు కొనసాగుతోన్న రైతు ఉద్యమానికి పంజాబ్, హర్యానాల్లోనే బీజం పడిన విషయం తెలిసిందే. పంజాబ్ రైతు నేతలు ఈ ఉద్యమానికి సారథ్యాన్ని వహిస్తోన్నారు. వ్యవసాయ ఆధారిత పంజాబ్ ముందు నుంచీ కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉంటూ వస్తోంది. ఇన్నిరోజులూ కేంద్ర ప్రభుత్వంపై తమకు ఉన్న ఆగ్రహాన్ని ఉద్యమాల ద్వారా వ్యక్తం చేసిన పంజాబ్ రైతులు.. ఈ సారి ఓట్ల రూపంలో దాన్ని ప్రతిఫలింపజేశారు.












Click it and Unblock the Notifications