పంజాబ్: అట్టారీకి నోట్లరద్దు ఎఫెక్ట్.. కనీస వసతులకూ దూరమే
పాకిస్థాన్తో సరిహద్దు ప్రాంతమైన అట్టారీ పట్టణ వాసులంతా దేశం కోసం స్వచ్ఛందంగా సేవలందించేందుకు సిద్ధమంటున్నారు. ఇరు దేశాల మధ్య గల అంతర్జాతీయ సరిహద్దుకు కూత వేటు దూరంలోనే ఈ పట్టణం ఉంది.
అట్టారి: పాకిస్థాన్తో సరిహద్దు ప్రాంతమైన అట్టారీ పట్టణ వాసులంతా దేశం కోసం స్వచ్ఛందంగా సేవలందించేందుకు సిద్ధమంటున్నారు. ఇరు దేశాల మధ్య గల అంతర్జాతీయ సరిహద్దుకు కూత వేటు దూరంలోనే ఈ పట్టణం ఉంది. గతేడాది పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ లక్షిత దాడుల తర్వాత ఇరు దేశాల సరిహద్దుల్లో నిత్యం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
లక్షిత దాడుల తర్వాత తలెత్తే పరిస్థితులను ముందుగానే ఊహించిన ఆర్మీ.. సరిహద్దుల్లో 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో గల గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది కూడా. అట్టారి అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు గ్రామాలు సరిహద్దులకు ఒకటి, రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. ప్రజలు కూడా అక్కడే ఉండేందుకు సిద్ధమంటున్నారు. యుద్ధం వస్తే పాకిస్థాన్ సేనలతో తల పడేందుకు 'సై' అంటున్నారని 61 ఏళ్ల సుర్జిత్ సింగ్ తెలిపారు. సర్జికల్ స్ట్రయిక్స్ తర్వాత నివాసులంతా ధైర్య సాహసాలతో ముందుకు సాగుతున్నారని, ఏ ఒక్కరూ ఇంటిని వీడి దూర ప్రాంతాలకు వెళ్లడం లేదని మాఝా ప్రాంతంలోని ప్రజలంతా దేశం కోసం ప్రాణాలర్పించేందుకైనా సిద్ధమేనని హర్జిందర్ సింగ్ అనే కార్పెంటర్ తెలిపాడు.
సరిహద్దుల్లో ఉన్న అట్టారీ నియోజకవర్గం పట్ల పాలక పక్షాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని చెప్తున్నారు. సరిహద్దుల్లోని ఈ నియోజకవర్గ గ్రామాల్లో కనీస వసతులు లేవంటే అతిశేయోక్తి కాదు. కనీస ఆరోగ్య, విద్యా వసతులకూ కూడా ఈ గ్రామాలు దూరంగానే ఉన్నాయి. రోడ్లపై నిర్మించిన వంతెనలు కూడా సురక్షితం కాదని తెలిపారు. నాలుగు నెలల క్రితం జరిగిన ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు మరణించారని గుర్తుచేస్తున్నారు. తమ నియోజకవర్గ గ్రామాలకు వసతులు కల్పించాల్సిన అవసరం ఉన్నదని సుర్జిత్ సింగ్, జాగ్తార్ సింగ్ అనే అట్టారి వాసులు అంటున్నారు.
అట్టారీలో ఒక ఆసుపత్రి ఉన్నా అందులో వసతులేమీ ఉండబోవని జాగ్తార్ తెలిపాడు. తమకేదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తితే 25 కిలోమీటర్ల దూరంలోని అమ్రుత్ సర్ పట్టణానికి పరుగులు తీయాల్సిందేనని ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే వారే కరువయ్యారని తెలిపారు. సరిహద్దుల్లో గల అట్టారీ ప్రాంతాన్ని అద్బుతంగా తీర్చిదిద్ది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని స్థానికులు చెప్తున్నారు.
అసలు సమస్యేమిటంటే అట్టారీ నియోజకవర్గం రిజర్వుడ్ స్థానం కావడమే. 1,71,586 మంది ఓటర్లు గల ఈ నియోజకవర్గం నుంచి శిరోమణి అకాలీదళ్ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి గుల్జార్ సింగ్ రాణికే మళ్లీ పోటీచేస్తున్నారు. 10 మంది అభ్యర్థుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి తర్సీం సింగ్ డీసీ, ఆమ్ఆద్మీ పార్టీ అభ్యర్థి జస్విందర్ సింగ్ జహంగీర్, బీఎస్పీ నేత సుఖ్వాంజిత్ కౌర్, సిపిఐ అభ్యర్థి గుర్దీప్ సింగ్ తలపడుతున్నారు.
నోట్ల రద్దుతో విలవిల
అసలే సరిహద్దు ప్రాంతం. ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయం నుంచి అట్టారీ ఇంకా కోలుకోనేలేదు. కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ ఎన్ని ప్రకటనలు చేసినా నగదు విత్ డ్రాయల్స్ కోసం బ్యాంకుల ముందు క్యూ లైన్లలో నిలబడక తప్పడం లేదని, పండ్ల రైతులకు నగదు చెల్లింపులు చేసేందుకు కష్టాల పాలవ్వాల్సి వస్తున్నదని హర్జిందర్ సింగ్, సకాతార్ సింగ్ అనే కమీషన్ ఏజంట్లు చెప్తున్నారు. తాజా పరిస్థితులు రైతులపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతాయని, కానీ తామేమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని సకతార్ సింగ్ అంటున్నారు.
సరిహద్దుల్లో కంచెతో సమస్యలు
అట్టారీ - వాఘా సరిహద్దుకు కిలోమీటర్ దూరంలో ఉన్న అటల్ గఢ్ గ్రామ వాసి బాబా జస్బీర్ సింగ్ సమస్య మరొకటి. సరిహద్దు వెంబడి ఇనుప కంచె నిర్మాణం చేపట్టడంతో తాను పొలం సాగెలా చేసుకోవాలని ప్రశ్నిస్తున్నాడు. ఒక్కో కుటుంబానికి ఒక గుర్తింపు కార్డు మాత్రమే ఇస్తున్నారని, దీనివల్ల పంట చూసుకోవడానికి భూమి దున్నడానికి ఒక్కరే వెళ్లాల్సి వస్తున్నదని, అదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల్లోపు వెనుదిరిగి రావాల్సిందేనని చెప్తున్నారు. పంట పొలం నుంచి కోసిన ధాన్యాలను తీసుకొచ్చే వాహనాలు (ట్రాలీ) పూర్తిగా తనిఖీచేయడం వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కాదని బాబా జస్బీర్ సింగ్ ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు. సొంత భూమిలోకి వెళ్లడానికి, పంట సంరక్షణ బాధ్యతలు నిర్వర్తించేందుకూ కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తున్నదని తెలిపాడు.
పోటాపోటీగా ప్రధాన పార్టీలు
2007లో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రత్తన్ సింగ్ గెలుపొందితే.. 2012లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తర్సిం సింగ్ డీసీపై రణికే విజయం సాధించారు. ఈ దఫా కూడా తన విజయంపై పూర్తిగా ధీమాగా ఉన్నారు. తమ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రగతి కార్యక్రమాలు చేపట్టిందని, తమకే విజయం తథ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న నావ అని, ఆప్ అభ్యర్థి ఇక్కడి వారికి సుపరిచితుడు కాదన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి తర్సిం సింగ్ డీసి మాట్లాడుతూ రాష్ట్రాన్నీ లూటీ చేసిన అకాలీలకు పూర్తిగా తలుపులు మూసుకున్నాయని, రాష్ట్రాన్ని డ్రగ్స్ మహమ్మారి నుంచి కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాపాడగలుగుతుందన్నారు. ఆప్ అభ్యర్థి జహంగీర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు క్లీన్, హానెస్ట్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని పంజాబీలు తలపోస్తున్నారని తెలిపారు.
వాణి వినిపించనున్న ఎన్నారైలు
నాలుగో తేదీన జరిగే ఎన్నికల్లో తమ వాణిని సమర్థవంతంగా వినిపించేందుకు ఎన్నారై పంజాబీలు సిద్ధమవుతున్నారు. పార్టీల వారీగా చీలిపోయారు. అమెరికా, కెనడా, బ్రిటన్ తదితర దేశాల నుంచి ఇప్పటికే పంజాబీలు తమ సొంత ప్రాంతాలకు చేరుకుని అన్ని ప్రధానపార్టీల ద్రుష్టిని ఆకర్షించారు. ప్రధానంగా కాంగ్రెస్, అకాలీదళ్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లకు ఎన్నారైలు భారీగా విరాళాలు అందజేస్తున్నారు. ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం సుఖ్ బీర్ సింగ్ బాదల్, పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా ఏడాదిక్రితమే ఎన్నారైల మద్దతు కోసం విదేశాల్లో పర్యటించి వచ్చారు కూడా.
ప్రస్తుత ఎన్నికల్లో భారీగా లబ్ది పొందుతున్న పార్టీ ఆప్. కెనడా నుంచి భారీగా ఎన్నారైలు తరలి వచ్చి ఆప్ అభ్యర్థుల విజయానికి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. భారీ మొత్తంలో ఆప్ కు నిధులందాయని కెనడాలోని వాంకోవర్ వాసి హర్ బక్ష్ సింగ్ తెలిపారు. కెనడా నుంచి వచ్చిన తొలి ప్రచార బ్రుందానికి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, పార్టీ నేతలు కుమార్ విశ్వాస్, సంజయ్ సింగ్ తదితరులు ఘనంగా స్వాగతం పలికి పంజాబ్ ఎన్నికల సమరంలోకి తోడ్కోని వచ్చారు. ఇక కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చేందుకు బ్రిటన్, కెనడాల నుంచి వచ్చిన ఎన్నారైలకు కెప్టెన్ అమరీందర్ సింగ్ స్వాగతం పలికారు.
ధూంధాంగా ఎన్నారైల ప్రచారం: ఎన్నారైలు ఉగ్రవాదులన్న సుఖ్ బీర్
వచ్చీ రావడంతోనే ఎన్నారైలు తమకు అనుబంధం గల పార్టీల తరఫున తమ సొంత ప్రాంతాల్లో దూకుడుా ప్రచారంచేయడం ప్రారంబించారు. పట్టణాల నుంచి గ్రామాలకు తరలి వెళ్తున్నారు కూడా. ఎన్నారైల రాజధానిగా పేరొందిన జలంధర్లో 300 కార్లతో ర్యాలీ కూడా నిర్వహించారు. కాకపోతే విదేశాల్లోని ఖలిస్థాన్ అనుకూల వాదులతో ఆప్ చేతులు కలిపిందని డిప్యూటీ సీఎం సుఖ్ బీర్ సింగ్ బాదల్ ఆరోపిస్తారు.
దీనిపై ఆప్ నాయకత్వం కూడా ఘాటుగానే స్పందించింది. ఎన్నారైలందరిపై ఖలిస్థాన్ ముద్ర వేస్తారా? అని సంజయ్ సింగ్ మండిపడ్డారు. అధికార శిరోమణి అకాలీదళ్ - బీజేపీ సంకీర్ణ కూటమి, కాంగ్రెస్ పార్టీలను ఓడించడమే లక్ష్యంగా తాము వచ్చామని టొరంటో 'చలో పంజాబ్' కన్వీనర్ సురీందర్ మావి తెలిపారు. పంజాబ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు ఆప్ మాత్రమే తమకు ప్రత్యామ్నాయ మార్గంగా కనిపిస్తోందన్నారు. ఎన్నారైలపై సుఖ్ బీర్ సింగ్ చేసిన వ్యాఖ్యలను పలువురు ప్రశ్నించారు.
గెలిపించినందుకు ప్రతిఫలమా?
2007 ఎన్నికల్లో రాష్ట్రానికి మంచి జరుగాలని అకాలీదళ్ పార్టీకి భారీగా నిధులు కేటాయించామని ఆప్ ఎన్నారై సెల్ అధిపతి జగ్తార్ సింగ్ సంఘీరా తెలిపారు. కానీ అదే అకాలీదళ్ పార్టీ నాయకత్వం తమపై ఖలిస్తాన్ ఉగ్రవాదుల ముద్ర వేస్తున్నదని మండిపడ్డారు. కెనడా నుంచి 35 వేల మంది పంజాబీలు ఎన్నికల ప్రచారంలో విరివిగా పాల్గొనేందుకు వచ్చారు. డ్రగ్ మాఫియాను నియంత్రిస్తున్న బిక్రం సింగ్ మాజిథియాను ఓడించేందుకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న దోబా స్థానమంతా ఎన్నారైలు విస్త్రుత ప్రచారం చేస్తున్నారు. రాజకీయ నేపథ్యం లేని వారు కూడా పంజాబ్ కు వచ్చి తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. బ్రిటన్, కెనడా, అమెరికాల్లో విజయవంతమైన రాజకీయ నేతలుగా వెలుగొందుతున్నారని తెలిపారు.