పదే పదే ‘హంతక కొడుకు’ అంటూ.. జాదవ్ తల్లి, భార్యపై విషం కక్కిన పాక్ మీడియా!
న్యూఢిల్లీ: పాక్ మీడియా నోటికొచ్చిన కూతలు కూసింది. గూఢచర్యం ఆరోపణపై మరణశిక్ష పడి 22 నెలలుగా పాక్ జైలులో మగ్గిపోతున్న కులభూషణ్ జాదవ్ను చూసేందుకు ఇస్లామాబాద్ వెళ్లిన అతడి తల్లి, భార్యకు అడుగడుగునా అవమానాలే ఎదురయ్యాయి.
పాక్ అధికారుల సాక్షిగా అక్కడి మీడియా జాదవ్ తల్లి, భార్యపై మాటలతో విరుచుకుపడింది. నిజానికి ఒప్పంద నియమాల ప్రకారం మీడియాను అనుమతించరాదన్న నిబంధనను పాక్ అధికారులే తుంగలోకి తొక్కారు.

పాక్ మీడియాను దొడ్డిదారిన అనుమతించారు. దీంతో జాదవ్ను కలుసుకుని బయటకు వచ్చిన ఆయన తల్లి అవంతి, భార్య చేతనలను పాక్ మీడియా మాటలతో కుళ్లబొడిచింది.
వారిద్దరూ కారు వద్దకు వెళ్లేలోపే చుట్టుముట్టి అనరాని మాటలతో వారిని మానసిక క్షోభకు గురిచేసింది.
అవంతి జాదవ్ను 'హంతకుడి తల్లి' (ఖాతిల్ కా మా) అని సంబోధించింది. 'నీ హంతక తనయుడిని చూసిన తర్వాత నీకేమనిపించింది?' అని ఒక జర్నలిస్టు అవంతి జాదవ్ను నేరుగా అడిగేసింది. మరొక జర్నలిస్ట్ 'హంతక కొడుకును చూసేందుకు పెద్దమనసుతో అగీకరించిన పాక్ ప్రభుత్వానికి థాంక్స్ చెబుతారా?' అంటూ ప్రశ్నించారు.
జాదవ్ భార్య చేతనను కూడా పాక్ మీడియా విడిచిపెట్టలేదు. 'నీ భర్త వేలాది మంది అమాయకులైన పాకిస్థానీయులను ఊచకోత కోశాడు. దీనికి ఏం సమాధానం చెబుతావు?'అని ఓ జర్నలిస్టు ఆమెపై విషం కక్కాడు.
మీడియా ఇలా మాటలతో కుళ్లబొడవడంతో అవమాన భారంతో చాలాసేపు జాదవ్ తల్లి, భార్య నిస్సహాయంగా ఉన్నచోటే నిలబడిపోయారు. పాక్ మీడియా దుందుడుకుతనంపై బయటికొచ్చిన వీడియోలపై ఇప్పటికే భారత్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
పాక్ మీడియా తీరుపై భారత్ తీవ్ర ఆగ్రహం వక్తం చేయగా, ఇదే అంశాన్ని పార్లమెంటులో విపక్షాలు కూడా బుధవారం లెవనెత్తాయి. గురువారం దీనిపై ఉభయసభల్లోనూ ప్రభుత్వం తరఫున ప్రకటన చేస్తానని సుష్మాస్వరాజ్ లోక్సభకు తెలిపారు.












Click it and Unblock the Notifications