ఎపి, టిపై దృష్టి: కేంద్రమంత్రి, జగన్తో బ్రిటిష్ హైకమిషనర్
హైదరాబాద్/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. రెండు రాష్ట్రాల్లో వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధి పైన కేంద్రం దృష్టి సారించిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ సోమవారం అన్నారు. ఆయన బిజెపి కార్యాలయంలో పదాధికారులు, కిసాన్ మోర్చా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
హరిత, నీలి, పాల విప్లవాన్ని సాధిస్తామన్నారు. దానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఆరు నెలల్లోగా వ్యవసాయ భీమా తీసుకు వస్తామని, నదుల అనుసంధానం పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీటిని అందిస్తామని చెప్పారు. గుజరాత్ తరహాలో రైతులందరికీ భూసార కార్డులు ఇస్తామన్నారు.
వాజపేయి హయాంలో తీసుకు వచ్చిన నిర్ణయాల వల్లే పాల ఉత్పత్తిలో భారత దేశం మొదటి స్థానంలో ఉందన్నారు. రెండు రాష్ట్రాల్లో వ్యవసాయ, అనుబంధ అభివృద్ధిపై దృష్టి సారిస్తామన్నారు. రైతు సంపన్నంగా ఉండేందుకు కేంద్రం కృషి చేస్తోందన్నారు. గ్రామీణ వికాస యోజన కింద ప్రతి పంటకు నీరు అందిస్తామన్నారు.
కాగా, రాధామోహన్ సింగ్ మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. సాయంత్రం తెలంగాణ సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో భేటీ అవుతున్నారు.
రాష్ట్రాల సమస్యలపై కేంద్రం దృష్టి
రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి కేంద్రం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పిఎంవో కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. మూడు నెలలుగా పెండింగులో ఉన్న సమస్యలకు తక్షణ పరిష్కారం చూడాల్సి ఉందన్నారు.
జగన్ను కల్సిన బ్రిటిష్ హైకమిషనర్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని బ్రిటిష్ హైకమిషనర్ జేమ్స్ బెవాన్ సోమవారం కలిశారు.