మిని స్కర్ట్ రాధే మా: సమన్లు ఇచ్చిన పోలీసులు
ముంబై: అధ్యాత్మిక దేవత (గాడ్ వూమెన్) రాధే మా అలియాస్ సఖ్వీందర్ కౌర్ (53) కు వరకట్నం వేధింపుల కేసుకు సంబంధించి ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు. ముంబైలోని కండివ్లి పోలీస్ స్టేషన్ లో ఈ నెల 14వ తేది విచారణకు హాజరు కావాలని సీనియర్ పోలీసు అధికారి ముకుంద్ పవార్ సూచించారు.
ముంబైకి చెందిన నిక్కీ గుప్తా (32) అనే మహిళ తన అత్తమామలు తనను వరకట్నం తీసుకురావాలని వేదిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్తమామలు రాధే మా భక్తులు అని, వారిని రాధే మా రెచ్చగొడుతున్నారని నిక్కీ గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు నిక్కీ గుప్తా అత్త మామలతో పాటు రాధే మా మీద కేసు నమోదు చేశారు. ఇటివల రాధే మా ముంబై నగరం వదిలి నాదెండ్ కు మకాం మార్చారు. ఆదివారం రాత్రి రాధే మా ముంబై చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె ఇంటికి వెళ్లారు.
ఆదివారం రాత్రి ముంబై పోలీసు అధికారులు రాధే మాకు సమన్లు జారీ చేశారు. తరువాత ఆమె వాగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. నిక్కీ గుప్తు ఫిర్యాదు మేరకు ఆమె అత్తమామలతో సహ ఇప్పటి వరకు ఆరు మందికి సమన్లు జారీ చేశామని పోలీసు అధికారులు తెలిపారు.
రాధే మాను ఏడో నిందితురాలిగా చేర్చారు. ఇటివల రాధే మా మిని స్కర్ట్ వేసుకుని విదేశాలలో ఫోజులు ఇచ్చిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. భక్తులతో కలిసి రాధే మా బాలివుడ్ సినిమా పాటలకు అసభ్యంగా నృత్యం చేస్తుందని ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి.