రాఫెల్పై ఫ్రెంచ్ ప్రభుత్వం వివరణ ఇచ్చినా: కాంగ్రెస్ను ఏకేసిన నిర్మలా సీతారామన్, జైట్లీ
న్యూఢిల్లీ: రాఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. రాఫెల్ ఒప్పందంలో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. అయినా ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. ఓ ప్రధానిని దొంగగా చిత్రీకరించడం సరికాదన్నారు.
రాఫెల్ ఒప్పందంలో ఎలాంటి రహస్యం లేదన్నారు. దానిని పట్టుకుని కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తోందని, అధికారం కోల్పోయే సరికి కాంగ్రెస్కు పిచ్చి పట్టిందని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలకు చోటు లేదన్నారు. దొంగల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని రాహుల్ పైన ఘాటుగా స్పందించారు.
కాంగ్రెస్ నీతిగా పాలించి ఉంటే ఇప్పుడీ రాఫెల్ రచ్చ ఎందుకు ఉండేదని నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. యూపీఏ హయాంలో తప్పులు చేసి ఇప్పుడు తమ పైకి నెడుతున్నారని మండిపడ్డారు. మరోవైపు, ఈ నెల (సెప్టెంబర్) 28 నుంచి 30వ తేదీ వరకు సర్జికల్ స్ట్రయిక్స్ డేగా ప్రకటిస్తున్నట్లు ఆమె తెలిపారు. రాఫెల్ డీల్ పైన ఫ్రెంచ్ ప్రభుత్వం వివరణ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ నేతలు బురదజల్లాలని చూస్తున్నారని అరుణ్ జైట్లీ మండిపడ్డారు.
కాగా, రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై ఫ్రాన్స్ మాజీ అధ్యక్షులు ఫ్రాన్స్వో హోలన్ చేసిన వ్యాఖ్యలతో రాజకీయ దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. విమానాల తయారీలో భాగస్వామిగా రిలయన్స్ డిఫెన్స్ను ఎంపిక చేసుకోవాలని భారత ప్రభుత్వం డసో ఏవియేషన్ సంస్థకు సూచించిందని హోలన్ చెప్పినట్లు ఫ్రెంచ్ పత్రిక మీడియా పార్ట్ వెల్లడించింది. అయితే ఈ వార్తలను తాజాగా ఫ్రాన్స్ ప్రభుత్వం ఖండించింది.
ఒప్పందాల్లో భారత సంస్థలను ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ ఫ్రెంచ్ కంపెనీలకు ఉంటుందని తెలిపింది. ఫ్రాన్స్ స్పష్టత ఇచ్చినప్పటికీ దీనిపై ఇంకా రచ్చ రేగుతూనే ఉంది. ఫ్రెంచ్ ప్రభుత్వం వివరణ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.