సిఎంలూ! పోరాడండి: రాహుల్ గాంధీ, మోడీకి చురక
న్యూఢిల్లీ: ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ శుక్రవారం ఢిల్లీలో జరిగిన అఖిల భారత కాంగ్రెసు కమిటీ సమావేశంలో మాట్లాడారు. అవినీతిరహిత సమాజం కోసం కాంగ్రెసు పార్టీయే చిత్తశుద్ధితో పని చేస్తోందని, యువత రాజకీయాల్లోకి రావాలని, సామాన్యులతో కలిసి పని చేసేందుకు సిద్దమని ఈ సందర్భంగా రాహుల్ అన్నారు. భవిష్యత్తులో సగం రాష్ట్రాల్లో మహిళా ముఖ్యమంత్రులు ఉండాలన్నది తమ లక్ష్యమన్నారు. పార్లమెంటులో మహిళా బిల్లు ఆమోదం పొందాలని కోరుతున్నానన్నారు.
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పాలనలో దశాబ్దం పాటు భారత్ ఆర్థిక శక్తిగా ఎదిగిందన్నారు. సమాచార హక్కు చట్టం లాంటి పటిష్టమైన చట్టాలను కాంగ్రెసు నేతృత్వంలోని యూపిఏ ప్రభుత్వం తీసుకు వచ్చిందన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు అధికారం ఇచ్చినట్లయిందన్నారు. తాము ఎవరి ఒత్తిళ్లకు ఒగ్గి చట్టాలు తేలేదని, ప్రజల కోసం, వారి కోరిక మేరకే తెచ్చామన్నారు. కాంగ్రెసు పార్టీ పాలనలోనే ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామన్నారు.
పంచాయతీరాజ్ బలోపేతం చేసే దిశలో రాజీవ్ గాంధీ నిర్ణయాలు తీసుకున్నారన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లోను దేశాన్ని కాంగ్రెసు అగ్రస్థానంలో నిలిపిందని చెప్పారు. భారత్ను అవినీతిరహిత దేశంగా నిలిపేందుకు లోక్పాల్ తీసుకు వచ్చామని, ఉపాధి హామీ పథకం ద్వారా పేద ప్రజలకు అండగా నిలిచామన్నారు. అవినీతికి వ్యతిరేకంగా కాంగ్రెసు పార్టీ మొదటి నుండి పోరాడుతోందని చెప్పారు. అవినీతిరహిత సమాజానికి మరింత కృషి చేస్తామన్నారు. ప్రజలు తమకు ఉన్న అధికారాన్ని మరింత సద్వినియోగం చేసుకోవాలన్నారు.
నగదు బదలీ ద్వారా సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు చేరుతున్నాయన్నారు. ప్రజలకు అధికారం ఇచ్చే పార్టీ కాంగ్రెసు మాత్రమే అన్నారు. చట్టాల రూపకల్పలనలో ఎంపీలు, ఎమ్మెల్యేల అభిప్రాయాలకు కాంగ్రెసు విలువ ఇస్తుందన్నారు. సామాన్యులు కూడా రాజకీయాల్లోకి రావాలని, వారితో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాజకీయాల్లో విద్వేషాలను తమ పార్టీ ప్రోత్సహించదని చెప్పారు.
అవినీతిని అరికట్టేందుకు ఆర్టీఐ, లోక్పాల్లే కాకుండా మరిన్ని చట్టాలు తెస్తామన్నారు. ఏ సమస్యనైనా కాంగ్రెసు పార్టీ వాస్తవ దృష్టితో చూసి పరిష్కరిస్తుందన్నారు. నవతరం రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెసు మానిఫెస్టో ఉంటుందన్నారు. ఇతర పార్టీలలో నుండి వచ్చే వారికంటే పార్టీలోని వారికే ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తామని చెప్పారు.
మహిళా సాధికారత రానంత వరకు ఈ దేశం నిలదొక్కుకోలేదన్నారు. యువతరం కోసం కాంగ్రెసు పార్టీ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయన్నారు. ఇతర పార్టీల నుండి వచ్చే వారికి కూడా తలుపులు తెరిచే ఉంటాయన్నారు. నిజాయితీకి రక్ష.. అవినీతికి శిక్ష... ఇది తమ విధానమని, దీనిపై మరిన్ని చట్టాలు తెస్తామన్నారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని ముఖ్యమంత్రులను తాను కోరుతున్నానని అన్నారు.
మహిళలు మరింత రాజకీయాల్లోకి రావాలన్నారు. రాయితీ గ్యాస్ సిలిండర్లు 9 నుండి 12కు పెంచాల్సిందేనన్నారు. ప్రతిపక్షాలకు మార్కెటింగ్ రంగంలో మంచి పట్టుందని, జిమ్మిక్కులు, ఆటలు, పాటలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తారని బిజెపిని, ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్ధి నరేంద్ర మోడీని ఉద్దేశించి అన్నారు. కాంగ్రెసు పార్టీ అలాంటి జిమ్మిక్కులు చేయదని, స్వచ్ఛమైన మనసుతో ప్రజల వద్దకు వెళ్తుందన్నారు.
ప్రతిపక్షాలకు దేశ చరిత్ర తెలియదని ఎద్దేవా చేశారు. కాంగ్రెసు పార్టీ భారత్లో విడదీయరాని భాగమని, ప్రజల హృదయాల్లోనే ఉన్న కాంగ్రెసు పార్టీని ఎవరూ పంపించలేరన్నారు. కాంగ్రెసు ఆలోచన అంటే జాతిపిత మహాత్మా గాంధీ, నెహ్రూల ఆలోచన అన్నారు. దేశంలో ప్రతి పౌరుడి గౌరవాన్ని కాంగ్రెసు గుర్తిస్తుందన్నారు.