ఏజేఎల్ భూములు కాజేశారు.. ఆస్తులు కూడా, సుబ్రహ్మణ్య స్వామి పిల్తోనే వెలుగులోకి.. రాహుల్పై ఈడీ ప్రశ్నలు
నేషనల్ హెరాల్డ్కు సంబంధించి మనీ ల్యాండరింగ్ ఆరోపణలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తోంది. వరసగా రెండో రోజు విచారణ జరుగుతుంది. అయితే రాహుల్ గాంధీ సహకరించడం లేదట. అయితే నేషనల్ హెరాల్డ్ కేసుకు రాహుల్కు సంబంధం ఏంటీ..? నిధులు ఎలా దుర్వినియోగం అయ్యాయి. కేసు పుర్వాపరాలను ఒకసారి పరిశీలిద్దాం. ఈ కేసును కూడా బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి వేయడంతోనే వెలుగులోకి వచ్చింది.
నిధుల దుర్వినియోగం..
నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రచురించే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) కంపెనీని కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై 2012 నవంబరు 1వ తేదీన ఢిల్లీలో గల కోర్టులో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ప్రైవేటు కేసు దాఖలు చేశారు. మోసానికి పాల్పడ్డారని, ఏజేఎల్కు చెందిన వేల కోట్ల విలువ చేసే భూములను కాజేశారని సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు.
1600 కోట్ల విలువ గల ఆస్తులు
ఢిల్లీ, యూపీ తదితర ప్రాంతాల్లో ఏజేఎల్కు ఉన్న రూ.1,600 కోట్ల విలువైన ఆస్తులను వారు యజమానులుగా ఉన్న యంగ్ ఇండియన్ కంపెనీ ద్వారా దక్కించుకున్నారని ఆరోపించారు. మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణ జరిపిన ఈడీ ఇటీవల సోనియా, రాహుల్లకు సమన్లు జారీ చేసింది. రాహుల్ సోమవారం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. 2011 జనవరిలో జరిపిన ఏజేఎల్ షేర్ల కొనుగోలు వ్యవహారంలో వివాదం ఉంది.
5 వేల మంది
స్వాతంత్యానికి ముందు 5 వేల మంది స్వాతంత్య్ర సమరయోధుల నుంచి నెహ్రూ నిధులు సమీకరించి ఏజేఎల్ను ఏర్పాటు చేశారు. 5 వేల మంది ఈ కంపెనీకి షేర్ హోల్డర్లుగా ఉండేవారు. నేషనల్ హెరాల్డ్ పేరుతో ఇంగ్లీష్ వార్తాపత్రిక ప్రచురణను 1938లో ప్రారంభించారు. హిందీలో నవజీవన్, ఉర్దూలో ఖౌమీ ఆవాజ్ ప్రతికలను ఏజేఎల్ ప్రచురించింది. ఏజేఎల్ నష్టాల్లో ఉందంటూ నేషనల్ హెరాల్డ్ సహా ఆ సంస్థకు చెందిన అన్ని పత్రికల ముద్రణను 2008 ఏప్రిల్లో నిలిపివేశారు. ఆ సంస్థ ఆస్తులను అద్దెకు ఇచ్చేందుకు కూడా అనుమతిచ్చారు.
ఏఐసీసీ రుణాలు
2010 సెప్టెంబరు 1న లక్నోలోని ఏజేఎల్ కార్యాలయాన్ని ఢిల్లీలోని హెరాల్డ్ హౌస్లోకి తరలించారు. ఏజేఎల్కు ఎప్పటికప్పుడు ఏఐసీసీ రుణాలు ఇచ్చింది. 2010 డిసెంబరు 16 నాటికి రూ.90.21 కోట్లకు చేరాయి. రుణ బకాయిలను, ఏజేఎల్కు చెందిన 99.99 శాతం షేర్లను యంగ్ ఇండియన్కు ఏఐసీసీ బదలాయించింది.
ప్రతిగా యంగ్ ఇండియన్ కంపెనీ రూ.50 లక్షలు చెల్లించింది. అంతకు మూడు రోజుల ముందే యంగ్ ఇండియన్ కంపెనీ తొలి మేనేజింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి, రాహుల్ గాంధీని డైరెక్టర్గా నియమించారు. ఏజేఎల్ రియల్ ఎస్టేట్ విలువను రూ.5 వేల కోట్లుగా అంచనా వేశారు. ఆ సంస్థకు హెరాల్డ్ హౌస్ పేరుతో ఢిల్లీలో 10,000 చదరపు మీటర్ల స్థలంలో 6 అంతస్థుల భవనం ఉంది. దీంతోపాటు లక్నో, భోపాల్, ముంబై, ఇండోర్, పట్నా, పంచకుల తదితర ప్రాంతాల్లోనూ ఆ సంస్థకు ఆస్తులు ఉన్నాయి.