పన్నీరు ఇంటిపై దాడి, ఉద్రిక్తత: పళనికి వ్యతిరేకమని తేల్చేసిన రాహుల్
తమిళనాడు అసెంబ్లీలో జరిగే బలపరీక్షలో ఎటువైపు ఉండాలన్న దానిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల సందిగ్ధతకు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెరదించారు. అక్కడున్న ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలూ కలిసి ఎడప్పాడి ప
చెన్నై: తమిళనాడు రాజకీయ సంక్షోభం తుది దశకు చేరుకుంది. మరికొద్ది గంటల్లో ముఖ్యమంత్రి పళనిస్వామి బలనిరూపణ చేసుకోనున్నారు. కాగా, తమిళనాడు అసెంబ్లీలో జరిగే బలపరీక్షలో ఎటువైపు ఉండాలన్న దానిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల సందిగ్ధతకు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెరదించారు. అక్కడున్న ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలూ కలిసి ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని సూచించారు.
జయ, శశికళ బంధంపై వర్మ సంచలనం: కారణం చెప్పారు, ఫస్ట్ లుక్ ఇదే!
దీంతో ఇప్పటివరకు ఏం చేద్దామంటూ ఊగిసలాటలో ఉన్న తమిళనాడు కాంగ్రెస్ నాయకులకు ఓ స్పష్టత వచ్చినట్లయింది. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ ఇప్పటికే తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అద్యక్షుడు ఎస్ తిరునావుక్కరసర్కు శుక్రవారం రాత్రి దాటిన తర్వాత అధికారికంగా తెలియజేశారు.
అంతకుముందు చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరితో టీఎన్సీసీ చీఫ్ తిరునావుక్కరసర్ సమావేశమయ్యారు. బలపరీక్ష విషయంలో ఏం చేయాలన్న దానిపై అధిష్ఠానం ఓ నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఎమ్మెల్యేలకు తెలిపారు.
శనివారం ఉదయం 9 గంటలకు తాము మళ్లీ సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని అప్పుడు చెప్పారు. పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలంటూ తాను ట్వీట్ చేసినట్లుగా వచ్చిన కథనాలను ఆయన ఖండించారు. చివరకు అధికారికంగా ఢిల్లీ నుంచి కబురు రావడంతో అదే పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మాజీ ముఖ్యమంత్రి పన్నీరు ఇంటిపై దాడి
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కార్యాలయంపై దుండగులు దాడిచేసి వీరంగం సృష్టించారు. తేని జిల్లా బోడియనాయకనూరులోని పన్నీర్ కార్యాలయానికి చేరుకున్న గుర్తు తెలియని 30 మంది దుండగులు కుర్చీలు, పార్టీ బ్యానర్లను ధ్వంసం చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న పన్నీర్ మద్దతుదారుడు రాజవేల్పై దాడిచేశారు.
పావుగంటపాటు బీభత్సం సృష్టించిన అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. అదే సమయంలో పన్నీర్ కార్యాలయానికి సమీపంలో ఉన్న శశికళ మద్దతుదారుడు బాలమురుగన్ ఇంటిపైనా కొందరు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దాడితో బయటకు వచ్చిన బాలమురుగన్ పైనా దుండగులు రాళ్లు విసిరారు. ఈ ఘటనతో అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.