మోడీకి చిద్దూ సవాల్, మేం చెప్పం.. ఊగిపోయిన రాహుల్ గాంధీ
నోట్ల రద్దు అంశంపై ప్రధాని నరేంద్ర మోడీకి మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం సవాల్ విసిరారు. అదే సమయంలో ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఊగిపోయారు.
న్యూఢిల్లీ: నోట్ల రద్దు అంశంపై ప్రధాని నరేంద్ర మోడీకి మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం సవాల్ విసిరారు. అదే సమయంలో ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఊగిపోయారు.
రక్తం దారపోశారు
నోట్ల రద్దుతో ప్రధాని మోడీ దేశాన్ని 16 ఏళ్లు వెనక్కి నెట్టారని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం కోసం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు ఎంతో చేశారని వ్యాఖ్యానించారు. దేశం కోసం తమ పార్టీ నేతలు రక్తం దారపోశారన్నారు.
మోడీకి చెప్పాల్సిన అవసరం లేదు
దేశం కోసం మనం (కాంగ్రెస్) ఏం చేసామో ప్రధాని మోడీకి చెప్పవలసిన అవసరం ఎంతమాత్రమూ లేదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మంచి రోజులు అంటేనే కాంగ్రెస్ పార్టీ పాలన అన్నారు.
ఏ ప్రధాని చేయలేదు
ఆర్బీఐ, ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థను ప్రధాని మోడీ, బీజేపీ, ఆరెస్సెస్ నాశనం చేస్తున్నాయన్నారు. నోట్ల రద్దు ఓ అసమర్థ నిర్ణయం అన్నారు. గత డెబ్బై ఏళ్లలో ఏ ప్రధాని తీసుకొని అసమర్థ నిర్ణయాన్ని మోడీ తీసుకున్నారన్నారు. ఆర్బీఐ గవర్నర్ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోలేదన్నారు.
ఆటో మొబైల్ కీలకం
మేకిన్ ఇండియాకు ఆటో మోబైల్ కీలకమని చెప్పారు. నోట్ల రద్దు కారణంగా ఆటో మొబైల్ అరవై శాతం కుదేలయిందన్నారు. నోట్ల రద్దు పైన తాము మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. డెబ్బై ఏళ్లలో అన్ని వ్యవస్థలను తమ పార్టీ, ప్రభుత్వాలు గౌరవించాయని రాహుల్ గాంధీ అన్నారు.
మోడీ, మోహన్ భాగవత్ నడిపిస్తున్నారు
దేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ నడిపిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, ఆరెస్సెస్, మోడీలు తమ అభిప్రాయాలను ప్రజల పైన రుద్దుతున్నాయన్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, అప్పుడు మంచి రోజులు వస్తాయన్నారు.
మోడీకి చిద్దూ సవాల్
ప్రధాని మోడీకి చిదంబరం బుధవారం నాడు సవాల్ విసిరారు. నోట్ల రద్దుతో దేశంలోని నల్లధనం, నకిలీ నోట్లు, అవినీతి పూర్తిగా అంతమయ్యాయని మీరు చెప్పగలరా అని ప్రశ్నించారు. అలాంటప్పుడు ఎందుకు ప్రజలను ఇబ్బంది పెట్టారని నిలదీశారు.