భద్రతను పట్టించుకోని రాహుల్ గాంధీ- రెండేళ్లలో 113 సార్లు ఉల్లంఘన-సీఆర్పీఎఫ్ రిపోర్ట్ !
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ భారత్ జోడో యాత్రను చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా కేంద్రాన్ని అదనపు భద్రత కోరారు. తన జోడో యాత్రలో అసాంఘిక శక్తులు చొరబడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. దీంతో కేంద్ర హోంమంత్రిత్వశాఖ రాహుల్ కు కల్పిస్తున్న భద్రతపై సీఆర్ఫీఎఫ్ నివేదిక కోరింది. దీంతో సీఆర్పీఎఫ్ తాజాగా కేంద్ర హోంశాఖకు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో పలు సంచలన విషయాలు ఉన్నాయి.
కాంగ్రెస్ ఎంపీ హోదాలో ఉన్న రాహుల్ గాంధీకి ప్రస్తుతం జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తున్నారు. అయితే భారత్ జోడో యాత్రలో ఉన్న సమయంలోనూ ఆయన పక్కనే సీఆర్పీఎఫ్ భద్రతను కూడా కల్పిస్తున్నారు. కానీ భారత్ జోడో యాత్రలో తాజాగా పలుమార్లు భద్రతా ఉల్లంఘనలు చోటు చేసుకున్నట్లు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. దీంతో సీఆర్పీఎఫ్ దీనిపై స్పందించింది. రాహుల్ కు ప్రస్తుతం పూర్తిస్ధాయిలో భద్రత కల్పిస్తున్నట్లు కేంద్రానికి తెలిపింది. ఎక్కడికక్కడ రాష్ట్ర పోలీసులతో, భద్రతా సంస్ధలతో సమన్వయం చేసుకుంటూ ఈ భద్రత కల్పిస్తున్నట్లు పేర్కొంది.
అదే సమయంలో రాహుల్ గాంధీ సీఆర్పీఎఫ్ సూచించిన భద్రతా నిబంధనల్ని పలుమార్లు పాటించడం లేదని, ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నట్ల కూడా హోంశాఖకు రాసిన లేఖలో సీఆర్పీఎఫ్ తెలిపింది. 2020 నుంచి చూసుకుంటే ఇప్పటివరకూ ఇలాంటి 113 ఉల్లంఘనలు చోటు చేసుకున్నట్లు హోంశాఖకు వెల్లడించింది. వీటిపై రాహుల్ ను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నట్లు కూడా తెలిపింది. దీనిపై సీఆర్పీఎఫ్ తరఫున చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. దీంతో రాహుల్ తాము చెప్పిన నిబంధనలు పాటించకుండా, జోడో యాత్రకు భద్రత అడుగుతున్నట్లు చెప్పకనే చెప్పినట్లయింది.