మోదీజీ.. ఆర్థిక వ్యవస్థ పతనంపై మాట్లాడే దమ్ముందా? వర్సిటీలకు వెళ్లగలరా? రాహుల్ సవాల్
''రోజురోజుకూ దిగజారుతోన్న ఆర్థిక వ్యవస్థ.. చుక్కలనంటుతోన్న నిత్యావసరాల ధరలు.. సరుకులు కొనలేక జనం ఇబ్బందులు.. అమ్మకాలు లేక కంపెనీల మూసివేత.. ఇలాంటి రియల్ ఇష్యూలపై మాట్లాడగలిగే దమ్ము ప్రధాని నరేంద్ర మోడీకి ఉందా? దేశంలో ఏ యూనివర్సిటీకైనా వెళ్లి విద్యార్థులతో ఎకానమీపై మాట్లాడగలరా?''అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సవాలు చేశారు.
ఆర్థిక మందగమనం, పెరిగిన నిరుద్యోగిత లాంటి అంశాలపై ప్రధాని నోరు విప్పకపోవడం దారుణమని, కనీసం తన విధానమేంటో విద్యార్థులకైనా చెప్పి వాళ్లని ఒప్పించే సత్తా ప్రధానికి లేదని రాహుల్ ఎద్దేవా చేశారు. సోమవారం ప్రతిపక్ష పార్టీల సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. నిజమైన సమస్యల్ని పట్టించుకోకుండా, ప్రజలను విభజించడానికి ప్రధాని ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేత ఆరోపించారు.

విద్యార్థులు తమ న్యాయమైన సమస్యల కోసం నిరసన తెలిపే, ప్రజాస్వామిక పద్ధతిలో పోరాడే హక్కు ఉందని, కనీసం వాళ్లేం చెబుతున్నారో వినిపించుకోకుండా ప్రభుత్వం.. విద్యార్థులపై అణిచివేత ప్రయోగించడం సరికాదని రాహుల్ అన్నారు.
సీఏఏ వ్యతిరేక నిరసనలు, జేఎన్ యూ హింస, దేశ ఆర్థిక పరిస్థితులు తదితర అంశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రతిపక్ష పార్టీల సమావేశం జరిగింది. దీనికి బెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తోపాటు పలు పార్టీల నేతలు గైర్హాజరయ్యారు.












Click it and Unblock the Notifications