వినూత్న నిరసన.. ట్రాక్టర్ నడుపుకుంటూ పార్లమెంట్కు రాహుల్ గాంధీ..
వ్యవసాయ చట్టాలపై రైతు నేతల ఆందోళన కొనసాగుతోంది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరగడంతో.. రైతు నేతల నిరసన కంటిన్యూ అవుతుంది. వారికి సంఘీభావం తెలిపిందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వచ్చారు. అయితే వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ట్రాక్టర్ నడుపుతూ పార్లమెంటుకు వచ్చారు. మాస్క్ ధరించి మరీ.. ట్రాక్టర్ డ్రైవ్ చేశారు.
రైతుల బాధలను పార్లమెంటుకు తీసుకొచ్చానని రాహుల్ గాంధీ అన్నారు. అన్నదాతల గొంతులను కేంద్ర ప్రభుత్వం నొక్కేస్తోందని విమర్శించారు. రైతు సమస్యలపై పార్లమెంటులో చర్చ జరగకుండా అడ్డుకుంటుందని ధ్వజమెత్తారు. కొత్త వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
వ్యాపారవేత్తల కోసమే చట్టాలను తీసుకొచ్చారని ఆరోపించారు. ఈ విషయం యావత్ దేశానికి తెలుసు అని రాహుల్ గాంధీ చెప్పారు. కొత్త వ్యవసాయ చట్టాల పట్ల రైతుల అంతా చాలా సంతోషంగా ఉన్నారని కేంద్ర ప్రభుత్వం చెపుతుంది. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసనలు చేస్తున్న వారిని టెర్రరిస్టులు అంటుందని మండిపడ్డారు. రైతుల హక్కులను కేంద్ర ప్రభుత్వం అణచివేస్తోందని అన్నారు.
రాహుల్ గాంధీ పార్లమెంట్కు వస్తుండగా.. మిగతా నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. రణదీప్ సుర్జేవాలా.. యూత్ కాంగ్రెస్ చీఫ్ శ్రీనివాస్ బీవీ ఇతరులను పోలీసులు అడ్డుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో తమ నిరసనను తెలియజేస్తున్నారు. గత 8 నెలల నుంచి వారి ఆందోళన కొనసాగుతోంది. 200 మంది రైతులు జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన చేపడుతున్నారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 19న ప్రారంభమైన సంగతి తెలిసిందే. సమావేశాలకు ఒక రోజు ముందే పెగాసస్ స్పైవేర్ అంశం తెరపైకి వచ్చింది. దీంతో, పార్లమెంటు ఉభయసభలు ఆ అంశంపై వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఐదురోజులు సమావేశాలు జరగగా.. విపక్షాల ఆందోళనలతో ఎలాంటి చర్చనే జరగలేదు.