నా ప్రశ్నలకు మోడీ దగ్గర సమాధానాల్లేవు.. ఛత్తీస్ గఢ్ ప్రచారంలో రాహుల్ సెటైర్లు
రాయ్ పూర్ : ఛత్తీస్ గఢ్ రాజకీయం మరింత వేడెక్కింది. తొలిదశ పోలింగ్ పూర్తయి మలిదశ ఓటింగ్ కు సిద్ధమవుతున్న తరుణంలో పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విపక్షాల వీక్ నెస్ పై దెబ్బకొట్టేలా బీజేపీ వ్యూహముంటే.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలతో పాటు రఫేల్ అంశంపై బీజేపీని చెడుగుడు ఆడుతోంది కాంగ్రెస్.
ఆదివారం నాటితో ప్రచారపర్వానికి తెరపడనుంది. ఈక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అంబికాపూర్ క్యాంపెయిన్ లో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్రమోడీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు.
రఫెల్ పై చర్చకు రెడీయా? సీబీఐ అప్రతిష్ఠకు బీజేపీయే కారణం..!
ప్రధాని నరేంద్రమోడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు రాహుల్ గాంధీ. రఫేల్ ఒప్పందం విషయంలో మోడీకి సవాల్ విసిరారు. అందులో జరిగిన అవకతవకలపై చర్చకు తాను సిద్దమని.. కేవలం 15 నిమిషాలు చర్చించే దమ్ము మోడీకి ఉందా అంటూ ప్రశ్నించారు. రఫేల్ ఒప్పందంలో నియమనిబంధనలు తోసిరాజని మోడీ ఇష్టారాజ్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఫ్రెంచ్ ప్రెసిడెంట్, హెచ్ఏఎల్, అనిల్ అంబానీ వ్యాఖ్యల గురించి తాను మాట్లాడగలనని చెప్పిన రాహుల్.. దీంట్లో ఎవరి హస్తముందో ప్రధానితో పాటు రక్షణమంత్రికి తెలుసని ఫైరయ్యారు.
సుప్రీంకోర్టు, ఆర్బీఐ లాంటి అత్యున్నత వ్యవస్థలను బీజేపీ నిర్వీర్యం చేస్తోందని రాహుల్ ఆరోపించారు. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ కీర్తి ప్రతిష్ఠలు మంటగలవడానికి బీజేపీ విధానాలే కారణమని ధ్వజమెత్తారు. సీబీఐ డైరెక్టర్ ను అర్ధరాత్రి పూట తొలగించిన దౌర్భాగ్యం మోడీ హయాంలో జరిగిందని విరుచుకుపడ్డారు.
న్యాయవ్యవస్థకు గౌరవమేది..?
భారత న్యాయవ్యవస్థకు మచ్చ తెచ్చేలా బీజేపీ వ్యవహరించిందని ఆరోపించారు రాహుల్. చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా న్యాయవ్యవస్థకు తూట్లు పొడిచిందని మండిపడ్డారు. న్యాయవాదులే స్వయంగా మీడియా ఎదుటకు వచ్చిన ఘటన బీజేపీ పాలనకు పరాకాష్ట అని ఎద్దేవా చేశారు. న్యాయ వ్యవస్థను ఎలా గౌరవించాలో తెలియని మోడీ.. తన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వని పరిస్థితి ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
నోట్ల రద్దుతో ఒరిగిందేమిటి..?
పెద్ద నోట్ల రద్దు బీజేపీ నియంతృత్వ పోకడలకు అద్దం పట్టిందని విమర్శించారు రాహుల్. మోడీ స్వార్థానికి ఎంతోమంది బలయ్యారని ఆరోపించారు. నోట్ల రద్దు వల్ల దేశానికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరాయో చెప్పాలని డిమాండ్ చేశారు. 2016 లో మోడీ తీసుకున్న నిర్ణయం.. అమాయకపు ప్రజల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. పెద్ద నోట్ల రద్దు రద్దంటూ రాద్ధాంతం చేసిన మోడీ.. చివరకు వెయ్యి రూపాయల పెద్ద నోటు కన్నా మరింత పెద్దనోటు తెచ్చి తలనొప్పులు తెచ్చారని ఫైరయ్యారు. రెండు వేల నోటుతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. డీమానిటైజేషన్ కారణంగా దేశానికి ఏమి ఒరిగిందని ప్రశ్నించారు.
రుణాలు ఎగ్గొట్టినవారి భరతం పడతాం.. రైతు రుణమాఫీ చేస్తాం
రైతు రుణమాఫీ విషయంలో బీజేపీ పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. పేద రైతులకు బదులు పెద్దోళ్ల రుణాలు మాఫీ చేశారని ధ్వజమెత్తారు. బీజేపీకి కాలం చెల్లిందని ఛత్తీస్ గఢ్ లో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. రైతు రుణమాఫీ చేస్తామంటే డబ్బులెక్కడి నుంచి తెస్తారంటూ తమపై బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారని.. అది ఎలా చేస్తామో రానున్న రోజుల్లో వాళ్లే చూస్తారని వ్యాఖ్యానించారు.
తాము అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ కచ్చితంగా అమలు చేస్తామన్న రాహుల్.. కోట్ల రూపాయలకొద్దీ రుణాలు ఎగ్గొట్టి విదేశాల్లో దాక్కున్నవారి భరతం పడతామన్నారు. వారి నుంచి డబ్బు రికవరీ చేసి ఈ పథకం అమలుకు లైన్ క్లియర్ చేస్తామని చెప్పారు.