ఏపి పట్ల రాహుల్ గాంధీకి మంచి క్లారిటీ..! భావోద్వేగాలు చల్లబడ్డాకే ఏదైనా..!!
తెలంగాణ రెండు రోజుల పర్యటన సందర్బంగా పార్టీలో నూతన ఉత్సాహాన్ని నింపారు రాహుల్ గాంధీ. తెలంగాణలోపార్టీ పటిష్టత, ఎన్నికల వ్యూహం, పొత్తుల పట్ల ఓ స్పష్టత ఇచ్చారు. అంతే కాకుండా ఆంద్రప్రదవేశ్ లో కాంగ్రెస్ మనుగడ గురించి కూడా ఏక వాఖ్యంలో తన అభిప్రాయాన్ని బహిర్గతం చేసారు. హోటల్ తాజ్ క్రిష్ణాలో విలేకరులు అడిగిన ప్రశ్నకు ఊహించని సమాధానం చెప్పారు రాహుల్.
ఆంద్రప్రదేశ్ లో పార్టీ మునుగడకు దోహదపడే వాఖ్యలకు బదులు మరింత అగాదంలోకి కూరుకుపోయే వాఖ్యలు చేసారనే చర్చ జరుగుతోంది. విభజన తర్వాత ఏపిలొని పరిస్థితులు, ప్రజలమనోభావాలు రాహుల్ కి పూర్తిగా అర్థం ఐనట్టు తెలుస్తోంది. అందుకే ఆంద్రప్రదేశ్ పట్ల ఆఇ రకంగా స్పందించారని ప్రచారం జరుగుతోంది.
విభజన గాయం మానాలి..! అప్పటి వరకు ఆగాలి..!!
తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉనికిని కోల్పోయి ఇబ్బంది పడుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇలాగే నాలుగేళ్లు నెట్టుకొచ్చిన ఆ పార్టీ ఎన్నికలు సమీపిస్తున్నందున స్పీడు పెంచింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా ప్రభావం చూపించాలనుకుంటోంది. అలాగే ఏపీ ప్రజల దృష్టిలో తమ పార్టీపై ఉన్న అపవాదును పోగొట్టుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి కొంత ఆశాజనకంగానే ఉందని చెప్పాలి. అందుకోసమే అక్కడ అధికారం సాధించాలన్న పట్లుదలతో ఉంది. ఒకవైపు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకుంటూనే, మరోవైపు అధికారంలోకి రావడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఫలితంగా ఆ పార్టీ తెలంగాణలో బలపడుతోంది.
తెలంగాణలో గెలుస్తాం..! చరిత్ర తిరగ రాస్తాం..!
రాష్ట్రంలో ప్రస్తుతం మారుతున్న సమీకరణాల దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించగలమన్న ధీమా కాంగ్రెస్ నేతల్లో పెరిగిపోయిందని టాక్ వినిపిస్తోంది. దీనికి మరింత బలాన్ని చేకూర్చే క్రమంలోనే ఆ పార్టీ నాయకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీని రాష్ట్రానికి తీసుకువచ్చారు. ఈ పర్యటన తమకు ఎంతగానో ఉపయోగపడుతుందన్న ఆలోచనలో ఆ పార్టీ నాయకులు ఉన్నారు.
నిదానమే ప్రధానం..! ఏపీ లో అదే మా విధానం,,!!
ఏపీ విషయంలో మాత్రం రాహుల్ అభిప్రాయం భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఏపీకి చెందిన నేతలు కొందరు ఢిల్లీ వెళ్లి మరీ రాహుల్ కలిశారట. రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడాలంటే మీరు పర్యటించాలని కోరారని, దీనికి ఆయన విముఖత చూపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఏపీ విషయంలో రాహుల్కు ఇప్పటికే ఓ స్పష్టత ఉన్నట్టు తెలుస్తోంది. విభజన వల్ల ఆ పార్టీకి ఏపీ ఓటర్లు గత ఎన్నికల్లో ఇచ్చిన ఫలితాలను బట్టి పార్టీ పరిస్థితిని కాంగ్రెస్ హైకమాండ్ అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోంది. అందువల్లే రాహుల్ ఏపీ అంశాన్ని తేలిగ్గా తీసుకున్నారని సమాచారం.
ఆంద్రలో అంతం కాదు..! ఆరభం చూపిస్తాం..!!
తాజాగా హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన రాహుల్ ఇదే విషయంపై మాట్లాడడం చర్చనీయాంశం అవుతోంది. వచ్చే ఎన్నికల్లో ఏం చేసినా ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాలేమని, కానీ గత ఎన్నికల కంటే మంచి ఫలితాలనే సాధిస్తామని చెప్పాడు. దీంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. వాస్తవానికి రాహుల్ చెప్పినదాంట్లో వ్యతిరేకించడానికి ఏమీ లేదు. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి చూసిన వారికి ఈ విషయం అర్థమైపోతుంది. కాకపోతే ఆయన ఇలా బహిరంగంగా ప్రకటించడం ఆ పార్టీ నేతలను కలవరపాటుకు గురి చేస్తోంది. దీంతో ఆంద్రప్రదేశ్ రాజకీయల పట్ల ఢిల్లీలో ఉండే రాహుల్ గాంధీ కి మంచి అవగాహన ఉన్నట్టు నిర్ధారణ అవుతోంది.