మోడీ 9సార్లు ముడుపులు తీసుకున్నారు!: రాహుల్ సంచలన ఆరోపణ
మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు 6 నెలల పరిధిలో సహార కంపెనీ నుంచి మొత్తం 9సార్లు ముడుపులు అందుకున్నారని రాహుల్ ఆరోపించారు.
అహ్మదాబాద్: ప్రధాని మోడీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు 6నెలల పరిధిలో సహార కంపెనీ నుంచి మొత్తం 9సార్లు 40.1 కోట్ల రూపాయలను ముడుపులుగా అందుకున్నారని తేదీలతో సహా వివరించారు రాహుల్. బిర్లా సంస్థల నుంచి కూడా మోడీకి ముడుపులు అందాయని ఆరోపించారు.
మోడీ తీసుకున్న ముడుపులకు సంబంధించి సిట్ వద్ద అన్ని ఆధారాలున్నాయని రాహుల్ తెలిపారు. దీనిపై రెండున్నరేళ్లుగా విచారణ జరగడం లేదని, దేశం తరుపున తాను ప్రశ్నిస్తున్నానని రాహుల్ తెలిపారు. దీనిపై పార్లమెంట్ లో మాట్లాడటానికి తనకు అవకాశం ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మోడీ ముడుపుల వ్యవహారంపై స్వతంత్ర విచారణ జరిపించాలని రాహుల్ డిమాండ్ చేశారు.
అవినీతికి వ్యతిరేకంగా మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మద్దతు తెలుపుతామని, అలా అని ప్రజలు ఇబ్బందులకు గురిచేస్తే మాత్రం సహించేది లేదని అన్నారు. పేదలు బ్యాంకు రుణాలు చెల్లించకపోతే జైల్లో పెడుతున్నారని, అదే బడాబాబుల విషయంలో మాత్రం అలా జరగడం లేదని మండిపడ్డారు.
రైతులు కొనుగోలు చేసే ఏ వస్తువుకూ చెక్కులు తీసుకోరని, అకౌంట్ల ద్వారా డబ్బులు చెల్లించరని ఆయన తెలిపారు. మోదీ నిర్ణయం వల్ల దేశ ప్రజలు తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేయబడ్డారని ఆయన మండిపడ్డారు.

తేదీల వారీగా మోడీపై రాహుల్ చేసిన అవినీతి ఆరోపణలు:
1)2013 అక్టోబర్ 30న రూ.2.5 కోట్లు
2) 2013నవంబర్ 12న రూ.5 కోట్లు
3)2013నవంబర్ 27న రూ.2.5 కోట్లు
4)నవంబర్ 29న రూ.5 కోట్లు
5) డిసెంబర్ 6న రూ.5 కోట్లు
6)డిసెంబర్ 19న రూ.5 కోట్లు
7)జనవరి 13న రూ.5 కోట్లు
8) జవరి 28న రూ.5 కోట్లు
9) ఫిబ్రవరి 22 న రూ.5 కోట్లు
కొట్టిపారేసిన బీజేపీ:
మరోవైపు రాహుల్ గాంధీ ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసింది. ప్రధానిపై నిరాధార ఆరోపణలు చేయడంలో కాంగ్రెస్ కు అలవాటైందని పార్టీ విమర్శించింది. రాహుల్ సీరియస్ రాజకీయ నేత కాదని, పార్ట్ టైమ్ పొలిటిషియన్ అని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications