అమేథీకి రాహుల్ గాంధీ గుడ్ బై చెప్పనున్నారా..? నాందేడ్ నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం
కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా పలు మార్పులు జరుగుతున్నాయి. అభ్యర్థులు పోటీచేసే నియోజకవర్గాల మార్పుపై కూడా పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా తన నియోజకవర్గం నుంచి కాకుండా మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. గాంధీ కుటంబానికి కంచుకోటగా ఉన్న అమేథీ నియోజకవర్గం కాకుండా రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు..? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే.
మహారాష్ట్ర లేదా మధ్యప్రదేశ్ నుంచి రాహుల్ పోటీ..?
కాంగ్రెస్ పార్టీలో నిర్ణయాలు చాలా సడెన్గ ఉంటాయి. పార్టీలో మార్పులు చేర్పులపై వెంటనే నిర్ణయాలు జరిగిపోతుంటాయి. తక్కువ సమయంలోనే నిర్ణయాలు అలా జరిగిపోతుంటాయి. తాజాగా రాహుల్ గాంధీ పోటీ చేసే నియోజకవర్గం ఆ పార్టీలో చర్చనీయాంశమైంది. గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న అమేథీ నుంచి ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. అయితే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ మహారాష్ట్ర లేదా మధ్యప్రదేశ్ నుంచి బరిలోకి దిగే అవకాశాలున్నాయని సమాచారం.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కీలక నిర్ణయం, టార్గెట్ మోడీ-యోగి: ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు
నాందేడ్ లేదా చింద్వారా నుంచి పోటీ..?
రాహుల్ గాంధీ మహారాష్ట్రలోని నాందేడ్, లేదా మధ్యప్రదేశ్లోని చింద్వారా నుంచి పోటీచేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల సమాచారం. అయితే అమేథీ నుంచి ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ.. అమేథీ స్థానంతో పాటు నాందేడ్ లేదా చింద్వారా నుంచి పోటీ చేస్తారా అనేదానిపై స్పష్టత రాలేదు. " రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. తనకు ఇష్టం వచ్చిన చోట నుంచి పోటీ చేసే అధికారం ఉంది. ఒకవేళ నాందేడ్ నుంచి పోటీ చేయాలని భావిస్తే ఆ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తాం"అని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్ అన్నారు.
కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న నాందేడ్
నాందేడ్ సీటు కాంగ్రెస్కు కంచుకోటగా ఉంది. అక్కడి నుంచి పోటీ చేస్తే చాలా సేఫ్ అని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటి వరకు 20 లోక్సభ ఎన్నికలు జరుగగా నాందేడ్లో కాంగ్రెస్ 16 సార్లు విజయబాహుటా ఎగురవేసింది. 2014లో చవాన్ ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో మోడీ మేనియా ఉన్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో నాందేడ్ పార్లమెంటు పరిధిలోని 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో మూడు అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంది. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ అక్కడ ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది. ఇక 2017లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 81 స్థానాలకు గాను 73 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది.
రాహుల్ గాంధీ నాందేడ్ నుంచి లోక్సభ బరిలో నిల్చుంటే..సార్వత్రిక ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అశోక్ చవాన్కు అసెంబ్లీ స్థానం కేటాయించే అవకాశం ఉంది. 2011 జనాభా లెక్కలు ఒక్కసారి చూస్తే నాందేడ్లో 19శాతం ప్రజలు ఎస్సీ సామాజిక వర్గానికి చెందగా... 14శాతం మంది ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. మరో 10శాతం మంది బౌద్ధ సామాజిక వర్గానికి చెందినవారుగా ఉన్నారు.
నాందేడ్ నియోజకవర్గమే ఎందుకు..?
రాహుల్ గాంధీ నాందేడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తేనే బాగుంటుందని ఎందుకంటున్నారో దానిపై రాజకీయ నిపుణులు విశ్లేషించారు. సమాజ్ వాదీ పార్టీ బహుజన్ సమాజ్ వాదీ పార్టీలు ఉత్తర్ ప్రదేశ్లో కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న అమేథీ నియోజకవర్గంకు సంబంధించి ఇతర నియోజకవర్గాలపై ప్రభావం తక్కువగా ఉంటుంది.
ఒకవేళ రాహుల్ గాంధీ నాందేడ్ నుంచి బరిలో నిలిస్తే.. లాతూరు, యవత్మాల్, వషీం, పర్భానీ, హింగోలీ ప్రాంతాల్లో ప్రభావం కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ ఎన్సీపీలు పొత్తుతో వెళితే కనుక మరట్వాడా ప్రాంతంలో మరిన్ని ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు సార్వత్రిక ఎన్నికల తర్వాత సెప్టెంబర్లో కానీ, అక్టోబరులో కానీ జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మరిన్ని అసెంబ్లీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు నాందేడ్ జిల్లా కర్నాటక, తెలంగాణ ప్రాంతాలకు సరిహద్దుగా ఉంది కాబట్టి ఆ ప్రభావం ఈ ప్రాంతాల్లో కనిపిస్తుందని చెబుతున్నారు.