‘మోడీ ఆహ్వానం అందలేదు’: ఒత్తిడేనని రాహుల్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తనను టీ పార్టీకి పిలవలేదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం మధ్యాహ్నం స్పష్టం చేశారు. అందుకే ‘చాయ్ పే చర్చ'కు తాను వెళ్లడం లేదని ఆయన అన్నారు.
జీఎస్టీ బిల్లు విషయంలో కేంద్రంపై ఎంతో ఒత్తిడి ఉన్నందువల్లే మోడీ చర్చా మార్గానికి వచ్చారని, ఎన్డీయే ప్రవేశపెట్టిన బిల్లులో తమకు మూడు అభ్యంతరాలున్నాయని రాహుల్ చెప్పారు. వాటిని తొలగిస్తే, మద్దతిచ్చేందుకు తాము సుముఖంగానే ఉన్నామని, అవి తొలగించకుంటే మాత్రం బిల్లును అడ్డుకుంటామని స్పష్టం చేశారు.
ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ కార్యక్రమాలను తాము అడ్డుకోబోమని రాహుల్ గాంధీ చెప్పారు. కాగా, శుక్రవారం సాయంత్రం 7గంటలకు రేస్ కోర్సులోని తన నివాసానికి రావాలని మాజీ ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీలను మోడీ ఆహ్వానించిన విషయం తెలిసిందే.
ప్రభుత్వ సంస్కరణల్లో భాగంగా జిఎస్టి బిల్లుకు మద్దతివ్వాలని ఈ భేటీలో కోరే అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగా, పార్లమెంటును సజావుగా సాగాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. చాయ్ భేటీలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా పాల్గొన్నారు.