ఢిల్లీ పోలీసుల అదుపులో రాహుల్, ప్రియాంక-కాంగ్రెస్ నిరసనలతో రచ్చ రచ్చ
నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, విపక్షాలపై ఈడీ దాడుల్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో జరిగిన నిరసనల్లో అగ్రనేతలు రాహుల్, ప్రియాంక సహా పలువురు కాంగ్రెస్ ప్రముఖుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏఐసీసీ కార్యాలయం నుంచి రాష్ట్రపతి భవన్, ప్రధాని నివాసం వద్దకు ర్యాలీగా బయలుదేరిన నేతల్ని అడ్డుకునే క్రమంలో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.
ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, జీఎస్టీ, నిరుద్యోగం వంటి సమస్యలకు నిరసనగా శుక్రవారం రాష్ట్రపతి భవన్కు ర్యాలీగా బయలుదేరిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, శశిథరూర్లతో సహా కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీసులు దీనికి అనుమతివ్వకపోయినా కాంగ్రెస్ పార్టీ మాత్రం భారీ నిరసనను నిర్వహిస్తోంది. పారామిలటరీ బలగాలు, ఢిల్లీ పోలీసులు విజయచౌక్ రోడ్డును, పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్కు వెళ్లే మార్గాన్ని బారికేడ్లు వేసి అడ్డుకున్నారు. కాంగ్రెస్ ఎంపీల నిరసనను అడ్డుకునేందుకు మహిళా పారామిలటరీ సిబ్బంది బారికేడ్లకు అటువైపు క్యూలో నిల్చున్నారు. పీఎం ఇంటిని ఘెరావ్ చేయాలని కాంగ్రెస్ నేతలు ర్యాలీ చేపట్టారు.

కాంగ్రెస్ నేతల ర్యాలీని అడ్డుకునే క్రమంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఇప్పటికే ఢిల్లీలో జరుగుతున్న నిరసనల్లో కాంగ్రెస్ ఎంపీల్ని, అగ్రనేతలపై పలుమార్లు దౌర్జన్యంగా ప్రవర్తించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులు.. మరోసారి ఇవాళ విమర్శలకు కారణమయ్యారు. రాహుల్, ప్రియాంక వంటి అగ్రనేతల్ని సైతం పోలీసు వ్యాన్ లకు బలవంతంగా నెట్టేశారు.

మిగతా నేతల్నిసైతం ఎత్తిపారేశారు. రోడ్డుపై నిరసనలు చేస్తున్న నేతల్ని బలవంతంగా లాక్కెళ్లారు. దీంతో పోలీసులకూ, కాంగ్రెస్ నేతలకూ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు దౌర్జన్యం చేస్తూ అమర్యాదగా ప్రవర్తించినట్లు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
.












Click it and Unblock the Notifications