ప్రధాని మోడీని కడిగేసిన రాహుల్ గాంధీ, రూ. 55 వేల కోట్ల స్కీం: బుద్ది చెబుతారు !
అహ్మదాబాద్: గుజరాత్ శాసన సభ ఎన్నికల సందర్బంగా ప్రధాని నరేంద్ర మోడీకి రోజుకో ప్రశ్న వేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం ట్విటర్లో మరో ప్రశ్న వేశారు. గిరిజనుల సమస్యలను ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు పట్టించుకోవడం లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. గిరిజనులను బీజేపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్షం చేసిందని రాహుల్ గాంధీ విమర్శించారు.
హామీలు ఏమైనాయి ?
వలసల కారణంగా కనీస సదుపాయాలు కూడా నోచుకోలేని గిరిజనులకు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని బీజేపీ నాయకులను రాహుల్ గాంధీ నిలదీశారు. వలసలు గిరిజనుల వెన్ను విరిచేశాయని రాహుల్ గాంధీ ఆరోపించారు.
రూ. 55 వేల కోట్ల స్కీం !
ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చిన రూ. 55, 000 కోట్ల వన బంధు కల్యాణ్ యోజన పథకం ఏమైందని, ఎక్కడ అమలు అవుతుందో చెప్పాలని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తిచూపుతూ కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.
సొంత భూములు లాగేశారు
గిరిజనుల సొంత భూములను వాళ్ల చేతుల్లో నుంచి లాగేసుకున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. చివరికి ప్రధాని మోడీ సర్కారు అడవుల పైనా గిరిజనులకు ఎలాంటి హక్కు లేకుండా చేసిందని రాహుల్ గాంధీ విమర్శించారు. గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో గిరిజనులు కచ్చితంగా బీజేపీకి బుద్ది చెబుతారని రాహుల్ గాంధీ హెచ్చరించారు.
కనీస సౌకర్యాలు లేవు
గిరిజనులు ఆసుపత్రులు, పాఠశాలలు వంటి ప్రాథమిక సదుపాయాలను కూడా కోల్పోయారని రాహుల్ గాంధీ ఆరోపించారు. గిరిజనులను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ. 55, 000 కోట్లతో వన బంధు కల్యాణ్ యోజన అనే పథకాన్ని అమలు చేయనున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన విషయం తెలిసిందే.
రాహుల్ కు ఏం తెలుసు ?
రాహుల్ గాంధీ మతిలేకుండా మాట్లాడుతున్నారని, ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన వన బంధు కల్యాణ్ యోజన పథకం ఎలాంటి ఆటంకాలు లేకుండా సవ్యంగానే కొనసాగుతుందని, ఎన్నికల సమయంలో ఏదో మాట్లాడాలని రాహుల్ గాంధీ నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.