రూట్ మార్చిన రాహుల్ గాంధీ-10 రోజుల పాటు అక్కడే మకాం
న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ నెల 31వ తేదీన పర్యటన ప్రారంభం కానుంది. 10 రోజుల పాటు అక్కడే మకాం వేయనున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి ఎంపికపై ప్రస్తుతం ఆయన కసరత్తు సాగిస్తోన్నారు. ఇవ్వాళో, రేపో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నిర్ణయించిన నాయకుడు.. గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ప్రతిష్ఠంభన తొలగిపోతేనే ముందుగా నిర్దేశించుకున్న ప్రకారం ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రస్తుతం సిద్ధరామయ్య- డీకే శివకుమార్లల్లో ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయం మీద కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది.

దీని తరువాత రాహుల్ గాంధీ- అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. జూన్ 4వ తేదీన న్యూయార్క్లో భారీ ర్యాలీలో పాల్గొంటారు. ప్రదర్శనను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో ఈ ప్రదర్శన షెడ్యూల్ అయింది. సుమారు 5,000 మంది ప్రవాస భారతీయులు ఇందులో పాల్గొననున్నారు. అనంతరం స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో చర్చాగోష్ఠిలో పాల్గొంటారు.
అనంతరం వాషింగ్టన్ డీసీ, కాలిఫోర్నియాల్లో పర్యటిస్తారు. ఆయా నగరాల్లో ప్రవాస భారతీయులు నిర్వహించిన సదస్సుల్లో పాల్గొంటారు. కాలిఫోర్నియాలో ఇండియన్ డయాస్పొర భేటీకి హాజరవుతారు. తన పర్యటన సందర్భంగా అమెరికన్ కాంగ్రెస్ నాయకులు, పారిశ్రామికవేత్తలను కూడా రాహుల్ గాంధీ కలుసుకుంటారు.

జూన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్న విషయం తెలిసిందే. అంతకంటే ముందే రాహుల్ గాంధీ టూర్ షెడ్యూల్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రవాస భారతీయులతో వరుస భేటీలను నిర్వహించాల్సి ఉండటం చర్చనీయాంశమౌతోంది. జూన్ 22వ తేదీన మోదీ అమెరికాలో పర్యటించాల్సి ఉంది.
తమ దేశ పర్యటనకు వచ్చే మోదీకి జో బైడెన్ నుంచి అరుదైన ఆహ్వానం లభించింది. జూన్ 22వ తేదీన వైట్హౌస్లో ఏర్పాటు చేసే విందుకు హాజరు కావాలంటూ జో బైడెన్, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ నుంచి మోదీకి ఆహ్వానం అందింది. అమెరికా అధ్యక్షుడు, ఆయన భార్య.. భారత ప్రధానికి వైట్ హౌస్లో విందు ఏర్పాటు చేయడం సుదీర్ఘ విరామం తరువాత ఇదే తొలిసారి.












Click it and Unblock the Notifications