సభలో నవ్వులు: మోడీ దగ్గరికెళ్లి హత్తుకున్న రాహుల్! ఆపై కన్ను గీటుతూ..
Recommended Video
న్యూఢిల్లీ: శుక్రవారం కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా పలు ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ ప్రసంగం చేస్తుండగా.. ప్రధాని మోడీ చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు.
రాహుల్ వ్యాఖ్యలకు మోడీ నవ్వులు
కాగా, రాఫెల్ ఒప్పందంలో కుంభకోణం జరిగిందని ఆరోపించిన రాహుల్ గాంధీ.. తాను స్వయంగా ఫ్రాన్స్ అధ్యక్షుడుని కలిసి ఈ ఒప్పందం గురించి అడిగానని అన్నారు. ఇలాంటి ఒప్పందమేమీ భారత్తో చేసుకోలేదని ఫ్రాన్స్ అధ్యక్షుడు తనతో చెప్పారని రాహుల్ తెలిపారు. ఈ వ్యాఖ్యలు వినగానే ప్రధాని మోడీ నవ్వాపుకోలేకపోయారు.
రాహుల్ తీవ్ర విమర్శలు
ప్రధాని నరేంద్ర మోడీపైనా, ఆయన ప్రభుత్వంపైనా రాహుల్గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. తన ప్రసంగం అంతా పూర్తయిన తర్వాత రాహుల్ చేసిన పనికి సభలోని వారే కాదు, ప్రత్యక్ష ప్రసారం చూస్తున్న వారూ ఆశ్చర్యపోయారు.
మోడీ దగ్గరికి వెళ్లి..
ప్రసంగం ముగిసిన అనంతరం తాను ఉన్న చోటు నుంచి ప్రధాని మోడీ వద్దకు వెళ్లిన రాహుల్ ఆయనను కౌగలించుకున్నారు. ఈ హఠాత్పరిణామంతో మోడీ కూడా ఆశ్చర్యపోయారు. మోడీని కౌగలించుకుని తిరిగి వెళ్లిపోతున్న అనంతరం రాహుల్ను వెనక్కి పిలిచిన మోడీ.. కరచాలనం చేసి ఆయన భుజంపై తట్టారు.
కన్ను గీటుతూ..
ఆ తర్వాత తన స్థానంలోకి వెళ్లి కూర్చొన్న రాహుల్.. తోటి సభ్యులు ఏదో అడగటంతో కన్ను కొడుతూ కనిపించారు. ప్రధాని నరేంద్రమోడీని, రాహుల్ కౌగలించుకొన్న దృశ్యాలు, కన్ను గీటిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా హల్చల్ చేస్తున్నాయి. రాహుల్ వ్యవహరించిన తీరు సభ్యులందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. సభలో నవ్వులు పూయించింది.