పేదల తిండి గింజలతో ధనికులకు శానిటైజర్స్.. కేంద్రంపై భగ్గుమన్న రాహుల్..
సెంట్రల్ గోడౌన్లలో ఉన్న బియ్యం అదనపు నిల్వలను ఇథనాల్గా మార్చి హ్యాండ్ శానిటైజర్లను తయారుచేస్తామన్న కేంద్రం నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు లాక్ డౌన్ వేళ ఎంతోమంది ప్రజలు తిండి లేక అల్లాడుతుంటే.. కేంద్రం తిండి గింజలతో శానిటైజర్లు తయారుచేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.

పేదల తిండిగింజలతో ధనికులకు శానిటైజర్స్..
పేదలకు అందాల్సిన బియ్యాన్ని ధనికుల చేతులు కడిగేందుకు ఉపయోగిస్తారా అని రాహుల్ గాంధీ మండిపడ్డారు. 'భారత్లోని పేదలు ఇంకెప్పుడు మేల్కొంటారు. ఓవైపు మీరేమో ఆకలితో చస్తున్నారు.. మరోవైపు మీకు అందాల్సిన బియ్యంతో కేంద్రం శానిటైజర్లు తయారుచేసి ధనికుల చేతుల కడగడంలో బిజీగా ఉంది.' అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

పెట్రోలియం శాఖ నిర్ణయం..
కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేత్రుత్వంలో జరిగిన ఎన్బీసీసీ(జాతీయ జీవ ఇంధనాల కోఆర్డినేషన్ కమిటీ) సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. జీవ ఇంధనాలపై జాతీయ విధానాన్ని ఉటంకిస్తూ.. మిగులు ఆహార ధాన్యాలను ఇథనాల్గా మార్చేందుకు అది అనుమతిస్తుందని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. సెంట్రల్ గోడౌన్లలో మిగిలివున్న ఆహార ధాన్యాలతో శానిటైజర్లు తయారుచేయడంతో పాటు.. ఉద్గారాలను తగ్గించేందుకు పెట్రోల్లోనూ వీటిని ఉపయోగించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

గతంలో ఎన్నడూ లేదు..
గోడౌన్లలో ఉన్న ఆహార ధాన్యాల నుంచి కొంత భాగాన్ని ఇథనాల్ తయారీకి వినియోగించేందుకు కమిటీ అనుమతించిందని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. గోడౌన్లలో నిల్వలపై పెట్రోలియం మంత్రిత్వ శాఖకు చెందిన అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఎఫ్సీఐలో ప్రస్తుతం బఫర్ నిబంధనల కంటే మూడు రెట్లు ఎక్కువ ఆహార ధాన్యాల స్టాక్ ఉందన్నారు. జీవ ఇంధనాలపై జాతీయ విధానం ప్రకారం.. వ్యవసాయ మంత్రిత్వ శాఖ అంచనాల కంటే ఎక్కువ ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగి.. భారీ మొత్తంలో మిగులు నిల్వలు ఉన్నప్పుడు.. ఇథనాల్ వంటి కెమికల్స్ తయారీకి వాటిని ఉపయోగించేందుకు అనుమతి ఉంది. అయితే ఇప్పటివరకూ దీన్ని ఎప్పుడూ అమలుచేయలేదు.
Recommended Video

వెల్లువెత్తుతున్న విమర్శలు..
లాక్ డౌన్ మొదలై దాదాపు నెల రోజులు గడుస్తుండటంతో దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎంతోమంది ఉపాధి లేక,తిండి లేక అల్లాడుతున్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డు దారులకు ఉచిత ఆహార ధాన్యాలు సప్లై చేస్తున్నప్పటికీ.. కార్డులు లేనివారి పరిస్థితి దారుణంగా మారింది. ముఖ్యంగా చాలామంది వలసకార్మికులకు రేషన్ కార్డులు స్వస్థలాల్లో ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు. ఒక అంచనా ప్రకారం దాదాపు 40లక్షల నుంచి 50లక్షల మంది ప్రజలు రేషన్ వ్యవస్థకు వెలుపల ఉన్నారు. చివరిసారిగా 2011 పీడీఎస్(పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్) ఆధారంగా రేషన్ పంపిణీ చేస్తున్నారని.. ఏళ్లుగా దాన్ని అప్డేట్ చేయకపోవడం వల్ల ఎంతోమంది నష్టపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఆహార ధాన్యాలను శానిటైజర్ల తయారీకి వాడటంపై విమర్శలను మరింత పెంచుతోంది.












Click it and Unblock the Notifications