స్వామి సంచలన వ్యాఖ్యలు: రాహుల్ గాంధీ కొకైన్ మాత్రమే తీసుకుంటారట..!
వివాదాలకు వివాదాస్పద వ్యాఖ్యలకు ఎప్పుడూ కేరాఫ్ అడ్రస్గా నిలిచే బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ఈ సారి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ డ్రగ్స్ తీసుకుంటారని ఆయన చెప్పారు. అదికూడా కొకైన్ మాత్రమే వాడుతారని ముందుగా ఆయనకు డోప్ టెస్టు నిర్వహించాలని స్వామి అన్నారు. డోప్ టెస్టులో కచ్చితంగా రాహుల్ గాంధీ ఫెయిల్ అవుతారని స్వామి జోస్యం చెప్పారు.
పంజాబ్లో డ్రగ్స్ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో... ఎవరైతే పంజాబ్లో డ్రగ్స్ వినియోగిస్తున్న శాతం 70 శాతానికంటే ఎక్కవగా ఉందని వ్యాఖ్యలు చేశారో వారు ముందుగా డోప్ టెస్టు చేయించుకోవాలని కేంద్రమంత్రి హర్ సిమ్రత్ కౌర్ అన్నారు. ఈ క్రమంలోనే సుబ్రహ్మణ్య స్వామి రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
"కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ వ్యాఖ్యలను నేను స్వాగతిస్తున్నాను. ఆమె చెప్పిన వ్యక్తి మరెవరో కాదు. డ్రగ్స్ తీసుకుంటున్న వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఆమె పేరు బయటకు చెప్పన్నప్పటికీ రాహుల్ గాంధీ గురించే మంత్రి చెప్పారు. ఎందుకంటే 70శాతం పంజాబీలు డ్రగ్స్కు అలవాటు పడిపోయారన్న వ్యాఖ్యలు చేసింది రాహుల్ గాంధీనే."అని స్వామి చెప్పారు.
ఇదిలా ఉంటే పంజాబ్లో డ్రగ్స్ మహమ్మారిని తరిమిగొట్టేందుకు చట్టాలను కఠినతరం చేయాల్సి ఉందని.. ఎవరైనా డ్రగ్స్ విక్రయించినా.. సరఫరా చేసినా వారికి ఉరిశిక్ష వేయాలంటూ కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్కు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ లేఖ రాశారు. అనంతరం కొన్ని గంటల్లోనే పంజాబ్ ప్రభుత్వ ఉద్యోగులందరికీ డోప్ టెస్టులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై బీజేపీ నేతలు ఘాటుగా స్పందించారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులపైనే డోప్ టెస్టులు ఎందుకు నిర్వహించాలంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఆయన కేబినెట్ మంత్రులపై కూడా డోప్ టెస్టు నిర్వహించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
బీజేపీ నేతలు విసిరిని సవాలును స్వీకరించారు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్. డోప్ టెస్టు తనపై నిరభ్యంతరంగా చేయొచ్చంటూ చెప్పుకొచ్చారు. తనకు ఎలాంటి సమస్య లేదని స్పష్టం చేశారు.