రీఎంట్రీలో రాహుల్ కు అరుదైన గౌరవం- అవిశ్వాసంపై చర్చ మొదలుపెట్టే ఛాన్స్...!
మోడీ ఇంటిపేరు వ్యాఖ్యల కేసులో పరువునష్టం దావా ఎదుర్కొంటూ పార్లమెంటుకు దూరమైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు భారీ ఊరటనిచ్చాయి. ఈ ఆదేశాల తర్వాత ఆయనకు అన్నీ శుభశకునాలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని స్పీకర్ పునరుద్ధరించారు. దీంతో ఆయన ఇవాళ లోక్ సభకు హాజరై మిగతా విపక్ష ఎంపీలతో నిరసనలో కూడా పాల్గొన్నారు. అలాగే రేపు మరో కీలకమైన అంశంపై రాహుల్ గాంధీ తన వాయిస్ వినిపించబోతున్నారు.
మణిపూర్ అంశంపై కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై రేపటి నుంచి మూడు రోజుల పాటు లోక్ సభలో చర్చ జరగబోతోంది. మూడు రోజుల చర్చ తర్వాత ఈనెల 10న ప్రధాని మోడీ దీనిపై సభకు సమాధానం ఇస్తారు. ఇంతటి కీలకమైన చర్చను రాహుల్ గాంధీ రేపు లోక్ సభలో మొదలుపెట్టబోతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ రీఎంట్రీ ఘనంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. రేపు సభలో ప్రస్తావించిన మణిపూర్ అంశంపై ఇప్పటికే పలుమార్లు బయటమాట్లాడటంతో పాటు స్వయంగా ఆ రాష్ట్రంలో కూడా పర్యటించి వచ్చిన రాహుల్.. రేపు ప్రసంగంలో మోడీ సర్కార్ ను టార్గెట్ చేయబోతున్నారు.

రాహుల్ గాంధీ లోక్ సభలో ఎప్పుడు మాట్లాడటానికి ప్రయత్నించినా అధికార ఎన్డీయే పక్షం అడ్డంకులు కల్పిస్తూనే ఉంది. స్పీకర్ సాయంతో రాహుల్ గొంతు నొక్కేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తుంటుంది. కానీ రేపు మణిపూర్ పై అవిశ్వాస తీర్మానం చర్చను ఆయనే స్వయంగా మొదలుపెట్టబోతున్నారు. దీంతో పాటు కాంగ్రెస్ లో కీలక ఎంపీ కావడంతో ఆయనకు ఎక్కువ సమయం కూడా లభించే అవకాశముంది. కాబట్టి ఎన్డీయే సర్కార్ ను రాహుల్ ఉతికారేయడం ఖాయంగా తెలుస్తోంది.
పార్లమెంటులో రాహుల్ రీఎంట్రీ తర్వాత రేపు అవిశ్వాస తీర్మానంపై చేసే ప్రసంగమే ఆయనకు మొదటికి కానుంది. దీంతో మణిపూర్ అంశంపై రాహుల్ ఏం మాట్లాడతారా అన్న ఉత్కంఠ అధికార ఎన్డీయేతో పాటు విపక్ష ఇండియా కూటమి పార్టీల్లోనూ కనిపిస్తోంది. ఎన్డీయేపై ఎప్పుడూ సంచలన ఆరోపణలు చేసే రాహుల్ గాంధీ.. రేపు సభలో ఏం బాంబు పేల్చబోతున్నారు, అధికార పక్షాన్ని ఎలా ఇరుకునపెట్టబోతున్నారనేది దేశం ఆసక్తిగా గమనించనుంది.












Click it and Unblock the Notifications