మేనల్లుడు, మేనకోడలితో ఫుట్పాత్పై రాహుల్ గాంధీ వెయిటింగ్
Rahul Gandhi: దేశంలో ఆరో విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ ఉదయం 7 గంటలకు పోలింగ్ ఆరంభమైంది. మొత్తం ఎనిమిది రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 58 లోక్సభ స్థానాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు.
బిహార్- 8, ఢిల్లీ- 7, హర్యానా-10, జమ్మూ కాశ్మీర్- 1, ఒడిశా- 6, ఉత్తరప్రదేశ్- 14, పశ్చిమ బెంగాల్- 8, జార్ఖండ్-4 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ షెడ్యూల్ అయింది. ఈ దశ ఎన్నికల్లో పలువురు కీలక అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు. కేంద్ర మంత్రి దివంగత సుష్మాస్వరాజ్ కుమార్తె బాన్సురి స్వరాజ్.. ఈ ఎన్నికలతో రాజకీయ అరంగేట్రం చేశారు.

న్యూఢిల్లీ లోక్సభ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సోమ్నాథ్ భారతిపై ఆమె పోటీ చేశారు. ఢిల్లీ యూనివర్శిటీ పూర్వ విద్యార్థి కన్నయ్య కుమార్.. నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఉత్తర ప్రదేశ్లోని సుల్తాన్పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ పోటీలో నిలిచారు.
మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ తరఫున అనంత్ నాగ్ - రాజౌరి నుంచి, హర్యానాలోని కర్నాల్ నుంచి మనోహర్ లాల్ ఖట్టర్ బీజేపీ అభ్యర్థిగా రంగంలో నిలిచారు. గుర్గావ్ నుంచి బాలీవుడ్ నటుడు రాజ్ బబ్బర్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న వారి జాబితాలో ఉన్నారు.
ఈ ఉదయం న్యూఢిల్లీ లోక్సభ పరిధిలోని పోలింగ్ బూత్లో కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, రాబర్ట్ వాద్రా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలిసారిగా మరో పార్టీకి ఓటు వేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి సోమ్నాథ్ భారతికి వాళ్లు ఓటు వేశారు.

రాబర్ట్ వాద్రా- ప్రియాంక గాంధీ దంపతుల కొడుకు రేహాన్ రాజీవ్ వాద్రా, కూతురు మిరాయా వాద్రా కూడా ఇదే లోక్సభ పరిధిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం తల్లితో సెల్ఫీ దిగారు రాహుల్ గాంధీ. ఆ వెంటనే సోనియా గాంధీ పోలింగ్ బూత్ నుంచి తన నివాసానికి వెళ్లిపోయారు.
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేహాన్ రాజీవ్ వాద్రా, మిరాయా వాద్రా మాత్రం కొంతసేపు పోలింగ్ స్టేషన్ వద్దే గడిపారు. రోడ్డు మీద ఫుట్పాత్పై కూర్చున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఇంకా పోలింగ్ కేంద్రంలోనే ఉన్న తన బావ రాబర్ట్ వాద్రా కోసం రాహుల్ గాంధీ రోడ్డు మీదే గడిపారు. ఓటు వేసి పోలింగ్ కేంద్రం నుంచి బయటికి వచ్చిన తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications