షాకింగ్: రైల్వే దుప్పట్లు ఉతికేది 2 నెలలకు ఓసారి
న్యూఢిల్లీ: రైళ్లలో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ ఏసీ వంటి బోగీల్లో ప్రయాణం చేసేటప్పుడుకప్పుకునేందుకు దుప్పట్లు ఇస్తారు. వాటిని గమనిస్తే అవి వాసన వస్తుంటుంది. ఆ దుప్పట్లను రెండు నెలలకు ఓసారి ఉతుకుతారట. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే సహాయ మంత్రి మనోజ్ సిన్హా రాజ్యసభలో శుక్రవారం చెప్పారు.
భారతీయ రైల్వేలో ప్రయాణించేటప్పుడు దుప్పుట్లు దుర్వాసన రావడం గమనించే ఉంటారని, వాటిని రెండు నెలలకోసారి ఉతకడమే ఇందుకు కారణమని మంత్రి మనోజ్ సిన్హా చెప్పారు. బెడ్షీట్లు, బెడ్రోల్, దిండు కవర్లు ప్రతి రోజూ ఉతుకుతారని, దుప్పట్లను మాత్రం రెండు నెలలకోసారి ఉతుకుతారని చెప్పారు.
రైల్వే శాఖకు లినెన్ సరఫరా చేస్తున్న దుప్పట్ల నాణ్యత, పరిశుభ్రత పైన ఓ ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. దీనిపై రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ మాట్లాడుతూ.. ఇంతకముందులా ప్రయాణికులే వారి దుప్పట్లను తెచ్చుకునే విధానాన్ని మళ్లీ అమలు చేస్తే బాగుంటుందని సూచించారు.
ఛైర్మన్కు కాంగ్రెస్ ఎంపీలు మద్దతు పలికారు. దీనికి మంత్రి స్పందిస్తూ.. ప్రయాణికులు కోరుకుంటే, పాత పద్ధతిని అమలు చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. మరో రెండేళ్లలో 25 మెకనైజ్డ్ లాండ్రీలను రైల్వే శాఖ ఏర్పాటు చేస్తుందని, దీంతో 85 శాతం ప్రయాణీకులు పరిశుభ్రమైన దుప్పట్లను పొందగలరన్నారు.
భారతీయ రైల్వే బెడ్ రోల్ టేక్ అవే అనే ఓ తాత్కాలిక పథకం ప్రారంభించిందని, రైల్వే దుప్పట్లు నచ్చకుంటే ప్యాసింజర్లు ఆన్ లైన్లో రూ.110కి బ్లాంకెట్, రూ.140కి రెండు బెడ్ షీట్లు బుక్ చేసుకోవచ్చునని రైల్వే అధికారులు చెప్పారు. ప్రయాణం ముగిశాక ప్రయాణీకులు వాటిని ఇంటికి తీసుకు వెళ్లవచ్చన్నారు.