ప్రయాణికులకు గొప్ప ఉపశమనం కలిగించిన రైల్వే శాఖ
న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ మరో తీపి కబురు అందించింది. రైళ్లలో ప్రయాణించే వారికి ఐడెంటీటి ప్రూఫ్స్ సమర్పించే విషయంలో గొప్ప ఉపశమనం లభించింది. ఎందుకంటే.. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ డిజిటల్ వెర్షన్లను కూడా ఐడీ ప్రూఫ్స్గా అంగీకరిస్తామని రైల్వే శాఖ ప్రకటించింది.
దేశీయ రైల్వే గుర్తింపు ధృవీకరణలుగా మీ డిజిలాకర్ అందించే ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ సాఫ్ట్ కాపీలను అంగీకరిస్తుందని గురువారం పేర్కొంది. పలు కీలకమైన అధికారిక డాక్యుమెంట్లను స్టోర్ చేసుకోవడానికి ప్రభుత్వం ఈ డిజిటల్ స్టోరేజ్ సర్వీసులను అందిస్తోంది.
ఈ విషయంపై అన్ని జోనల్ ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్లకు రైల్వే ఓ అధికారిక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ రెండు గుర్తింపు ధృవీకరణలను చెల్లుబాటయ్యేవిగా భావిస్తామని తెలిపింది. ప్రధాని మోడీ ప్రభుత్వం డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా.. డిజిలాకర్ డ్రైవింగ్ లైసెన్స్ను, ఆధార్ను డిజిటల్గా అందిస్తోంది.