Vande Bharat express:తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రయాణీకులకు షాక్ - వందేభారత్ ఎఫెక్ట్...!!
రైల్వే శాఖ తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణీకులకు చెమటలు పట్టిస్తోంది. వందేభారత్ కు ఆదరణ కోసం కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం వందేభారత్ రైళ్లను ప్రమోట్ చేయటం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. వందేభారత్ కు ఆక్యెపెన్సీ పెంచేందుకు ప్రధాన ఎక్స్ ప్రెస్ రైళ్లల్లో ఏసీ కోచ్ లపైన కోతలు ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాల్లో రెండు వందేభారత్ రైళ్లు కొనసాగుతున్నాయి. ఈ రెండు రైళ్లు నడిచే మార్గంలో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్ రైళ్లల్లో ఏసీ ఛైర్ కార్లు తగ్గించటం..వందేభారత్ కోసం ఇతర రైళ్లను పక్కన పెడుతుండటంతో గంటల కొద్దీ ఇతర రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
వందేభారత్ కోసం: సికింద్రాబాద్ - విశాఖ మధ్య చాలా కాలంగా జన్మభూమి ఎక్స్ ప్రెస్ రాకపోకలు సాగిస్తోంది. ఉదయం సమయంలో నడిచే రైలు కావటంతో ఇందులో తొలి నుంచి మూడు ఏసీ ఛైర్ కార బోగీలతో నడుపుతున్నారు. రెగ్యులర్ గా ఈ కోచ్ లకు డిమాండ్ కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరిలో సికింద్రాబాద్ - విశాఖ మధ్య వందేభారత్ ప్రారంభమైంది. ఈ రైలుకు ఆదరణ బాగానే ఉంది. అయితే, దీనిని కొనసాగించేందుకు జన్మభూమిలో మూడు ఏసీ కోచ్ లను ఒకటికి పరిమితం చేసారు. దీని ద్వారా ఇదే సమయంలో నడిచే వందేభారత్ కు డిమాండ్ పెరిగేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సికింద్రాబాద్ - విశాఖ మధ్య ఛైర్ కార్లు ఉన్న రైళ్లు ఈ రెండు మాత్రమే.

ఏసీ కోచ్ ల్లో కోత: విశాఖ- సికింద్రాబాద్ మధ్య చైర్ కార్ ధర రూ 870గా ఉంది, వందేభారత్ లో రూ 1,655 గా నిర్ణయించారు. అయితే, జన్మభూమి కంటే వందేభారత్ లో ప్రయాణ సమయం తక్కువ. జన్మభూమిలో మూడు ఏసీ ఛైర్ కోచ్ లు ఉండగా, ప్రస్తుతం ఒక్కటే నిర్వహిస్తున్నారు. ఒక్కో ఏసీ కోచ్ లో 78 సీట్లు ఉంటాయి. ఇప్పుడు రెండు కోచ్ లకు కోత విధించటంతో ఏసీలో ప్రయాణం చేయాలని భావించే ప్రయాణీకులకు వందే భారత్ ను ఎంపిక చేసుకోక తప్పటం లేదు. వేసవిలో సుదీర్ఘ ప్రయాణం సమయంలో ప్రయాణీకులు ఎక్కువగా ఏసీ ఛైర్ కార్ కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రయాణీకుల అవసరాన్ని రైల్వే శాఖ అవకాశంగా మలచుకొని వందేభారత్ వైపు మొగ్గేలా పరోక్షంగా ప్రయాత్నాలు చేస్తోందనే వాదన ఉంది. దీని ద్వారా ప్రయాణీకులకు అదనపు టికెట్ భారం మోయాల్సి వస్తోంది.

గంటల కొద్దీ ఆలస్యం: ఇది జన్మభూమికే పరిమితం కాలేదు. తాజాగా గుంటూరు - వికారాబాద్ మధ్య సికింద్రాబాద్ మీదుగా నడిచే పల్నాడు ఎక్స్ ప్రెస్ లోనూ ఇదే తరహాలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. పల్నాడు ఎక్స్ ప్రెస్ కు గుంటూరు - సికింద్రాబాద్ మధ్య నిత్యం రద్దీ కొనసాగుతోంది. ఏసీ ఛైర్ కార్ కోచ్ లు రెండు కొనసాగేవి. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో మరో కోచ్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసే వారు. ఇప్పుడు పల్నాడులోనూ ఒకే కోచ్ కొనసాగుతోంది. తాజాగా సికింద్రాబాద్ - తిరుపతి మధ్య వందేభారత్ ప్రారంభమైంది. దీనిని గుంటూరు మీదుగా నడుపుతున్నారు. పల్నాడు ఏసీ కోచ్ లను ఒక్కటికే పరిమితం చేయటంతో ప్రయాణీకులకు ఇబ్బందిగా మారింది. ఇదే సమయంలో వందేభారత్ కోసం ప్రధాన ఎక్స్ ప్రెస్ రైళ్లను సైతం పక్కన పెడుతుండటంతో గంటల కొద్దీ ఆలస్యంగా రైళ్లు నడవటం ప్రయాణీకులకు సమస్యగా మారుతోంది.












Click it and Unblock the Notifications