ఘోరం: విద్యార్థిని కొట్టి చంపిన ఉపాధ్యాయుడు, నటిస్తున్నాడని తండ్రితో చెప్పాడు!
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో దారుణం జరిగింది. హోంవర్క్ చేయలేదని 7వ తరగతికి చెందిన ఓ విద్యార్థిని చితకబాదాడు ఓ ఉపాధ్యాయుడు. దీంతో దెబ్బలకు తాళలేక సదరు విద్యార్థి ప్రాణాలు వదిలాడు. ఈ దారుణ ఘటన చురు జిల్లాలోని సలాసర్ గ్రామంలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోలాసర్ గ్రామానికి చెందిన ఓంప్రకాశ్ కమారుడు స్థానికంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. కాగా, ఎలాంటి కారణం లేకుండానే నిందిత ఉపాధ్యాయుడు కొడుతున్నాడని తన కుమారుడు తనకు 15 రోజుల్లో నాలుగు సార్లు ఫిర్యాదు చేశాడని మృతుడి తండ్రి తెలిపాడు.

13ఏళ్ల తన కుమారుడు అపస్మారక స్థితిలో పడిపోయాడని నిందిత ఉపాధ్యాయుడు మనోజ్ కుమార్ తమకు సమాచారం అందించాడని ఓం ప్రకాశ్ తెలిపాడు. ఈ ఘటన బుధవారం ఉదయం 9.15 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. హోంవర్క్ పూర్తి చేయనందుకే విద్యార్థిని కొట్టానని, దీంతో అతడు స్పృహకోల్పోయాడని ఓం ప్రకాశ్కు మనోజ్ కుమార్ తెలిపాడు.
అయితే, తన కొడుకును కొట్టి చంపావా? అని ఓం ప్రకాశ్ ప్రశ్నించగా.. అతడు చచ్చిపోయినట్లు నటిస్తున్నాడని మనోజ్ కుమార్ అతనితో చెప్పాడు. వెంటనే తన కొడుకును సమీపంలోని ఆస్పత్రికి తరలించాడు ఓంప్రకాశ్. అయితే, అప్పటికే అతడు మరణించడాని చెప్పడంతో విద్యార్థి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Recommended Video
కాగా, బాధిత విద్యార్థిని టీచర్ మనోజ్ కుమార్ తీవ్రంగా కొట్టాడని, కిందపడేసి కాలుతో ఇష్టమొచ్చినట్లు తన్నాడని ప్రత్యక్షసాక్షులుగా ఉన్న విద్యార్థులు తెలిపారు. విపరీతంగా కొట్టడంతో తమకు కూడా భయం వేసిందని వాపోయారు. కాగా, మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడు మనోజ్ కుమార్పై పోలీసులు హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. త్వరలోనే నిందుతుడ్ని అరెస్ట్ చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications