నాడు చంద్రబాబు..నేడు అశోక్ గెహ్లాట్: ఆడియో టేపుల కలకలం: రాజస్థాన్ ప్రభుత్వం అనూహ్య ఆదేశాలు
జైపూర్: ఉరుము ఉరిమి మంగళం పడిందనేది ఓ పాత సామెత. రాజస్థాన్లో నెలకొన్న రాజకీయ సంక్షోభం, రోజురోజుకూ అక్కడ చోటు చేసుకుంటోన్న పరిణామాలను బట్టి చూస్తోంటే.. ఈ సామెత అతికి సరిపోయేలా కనిపిస్తోంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్పై భారతీయ జనతా పార్టీ నాయకులు చేసిన ఆడియో టేపుల వ్యవహారం ప్రస్తుతం రాజస్థాన్లో కలకలం రేపుతోంది. ఆడియో టేపుల వ్యవహారంపై సీబీఐ ద్వారా దర్యాప్తు జరిపించాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.

సీబీఐపై నిషేధం
సీబీఐని నిషేధించింది. సీబీఐ దర్యాప్తులను నిషేధిస్తూ గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ మేరకు రాజస్థాన్ హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలను ఇచ్చింది. ఎలాంటి దర్యాప్తులనైనా చేపట్టాలంటే.. ఇకపై సీబీఐ అధికారులు ప్రభుత్వ అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని అని రాజస్థాన్ ప్రభుత్వం పేర్కొంది. అశోక్ గెహ్లాట్పై ఆడియో టేపుల కలకలం చెలరేగిన వెంటనే.. రాజస్థాన్ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తును నిషేధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీబీఐ ప్రవేశాన్ని నిషేధించడంతో బీజేపీ నాయకులు తమ విమర్శల తీవ్రతను పెంచారు.

నాడు చంద్రబాబు..
ఇదివరకు ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం సీబీఐపై నిషేధాన్ని విధించిన విషయం తెలిసిందే. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వచ్చిన కొద్దిరోజుల్లోనే టీడీపీ నేతలపై సీబీఐ, ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు కొనసాగాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీబీఐని నిషేధించారు. సీబీఐ, ఐటీ వంటి రాజ్యాంగబద్ధ సంస్థలను కేంద్ర ప్రభుత్వం రాజకీయంగా కక్షసాధింపులను తీర్చుకోవడానికి ప్రయోగిస్తున్నారంటూ చంద్రబాబు అప్పట్లో ఆరోపించారు.

అదే బాటలో రాజస్థాన్ సర్కార్..
తాజాగా రాజస్థాన్ ప్రభుత్వం అదే బాటలో ప్రయాణించింది. సీబీఐని నిషేధించింది. భవిష్యత్తులో ఎలాంటి దర్యాప్తులు చేపట్టాలన్నా హోం మంత్రిత్వ శాఖ అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. హోం మంత్రిత్వ శాఖ అనుమతి ఉంటేనే దర్యాప్తును చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆడియో టేపుల వ్యవహారంలో అశోక్ గెహ్లాట్ తప్పు చేశారని, అందుకే సీబీఐ దర్యాప్తునకు భయపడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఆడియో టేపుల బాగోతంతో అశోక్ గెహ్లాట్ బండారం బయటపడటం ఖాయమని విమర్శిస్తున్నారు. దీనిపై జాతీయస్థాయి ఉద్యమాన్ని చేపడతామని బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు.
Recommended Video

సీబీఐని నిషేధించిన మూడో రాష్ట్రంగా..
ప్రస్తుతం దేశంలో రెండు రాష్ట్రాల్లో సీబీఐపై నిషేధం కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు సీబీఐని నిషేధించాయి. తాజాగా అదే జాబితాలో రాజస్థాన్ కూడా చేరింది. ఏపీలో దీనికి భిన్నమైన పరిస్థితి ఉంది. సీబీఐ దర్యాప్తుపై చంద్రబాబు ప్రభుత్వం విధించిన నిషేధాన్ని.. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తొలగించింది. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీబీఐపై విధించిన నిషేధాన్ని తొలగించారు. ఫలితంగా- రెండు కీలక ఘట్టాలపై రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతంపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది.












Click it and Unblock the Notifications