ఇది సుదినం, ప్రపంచంలోనే మోడీ అవినీతిపరుడు: బీజేపీ మంత్రి షాకింగ్!
జైపూర్: రాజస్తాన్ బీజేపీ నేత, మంత్రి ఒకరు ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించబోయి తప్పులో కాలేశారు. మోడీని ప్రశంసించబోయి ఆయననే ప్రపంచంలో అత్యంత అవినీతిపరుడు అని వ్యాఖ్యానించారు. ఇది మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలలో బీజేపీ గెలుపు నేపథ్యంలో రాజస్తాన్ మంత్రి డాక్టర్ జస్వంత్ సింగ్ యాదవ్ ప్రధాని మోడీని ప్రశంసించాలనుకున్నారు. ఆ ఉద్వేగంలో చటుక్కున నరేంద్ర మోడీ ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడు అంటూ వ్యాఖ్యానించారు.
సంచలనం సృష్టిస్తున్న వీడియో
వసుంధరా రాజే ప్రభుత్వంలో జస్వంత్ కార్మిక, ఉపాధి శాఖ మంత్రిగా ఉన్నారు. యాదవ్ చేసిన ఈ వ్యాఖ్యలతో ఉన్న వీడియో క్లిప్పింగ్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అల్వార్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎంతో మంచి రోజు అంటూ మోడీపై ఇలా
ఆయన మాట్లాడుతూ... ఈ రోజు ఎంతో మంచి రోజు అని, అత్యంత గౌరవనీయులైన, ఎంతో ఖ్యాతిగాంచిన మన ప్రధాని నరేంద్ర మోడీ.. ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడు, ఆయన నాయకత్వంలో ఇటీవల ఎన్నికల్లో ఘన విజయం సాధించాం అని వ్యాఖ్యానించారు.
ఆయన పక్కన ఉన్న వారు కూడా గుర్తించలేదు
జస్వంత్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో ఆయన పక్కన ఉన్న వారు ఎవరు కూడా ఆయన చేసిన వ్యాఖ్యలను గుర్తించలేకపోయారు. ఆయనను వారించి, సరిచేయలేదు. దీంతో ఆయన ప్రసంగం అక్కడితో ముగిసిపోయింది. ఇది ఇప్పుడు అందరిలో చర్చనీయాంశమైంది.
ఆరోసారి బీజేపీ గెలుపు
కాగా, ఇటీవల గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. గుజరాత్లో బీజేపీ వరుసగా ఆరోసారి విజయం సాధించింది. ఇది అనూహ్యమైన గెలుపే. అలాగే హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ను కాదని కమలం పార్టీ గెలిచింది.