షాకింగ్: తల్లిని సరిగా చూసుకోవడం లేదని.. కారు డోర్లు లాక్ చేసి.. ఇద్దరు భార్యలను తగలబెట్టిన భర్త!
తన తల్లిని సరిగా చూసుకోవడం లేదన్న కోపంతో ఓ వ్యక్తి తన ఇద్దరు భార్యలను తగలబెట్టేశాడు. ఈ సంచలన ఘటన రాజస్థాన్లోని జాలోర్ జిల్లా సంచోర్లో చోటు చేసుకుంది.
జైపూర్: తన తల్లిని సరిగా చూసుకోవడం లేదన్న కోపంతో ఓ వ్యక్తి తన ఇద్దరు భార్యలను తగలబెట్టేశాడు. ఈ సంచలన ఘటన రాజస్థాన్లోని జాలోర్ జిల్లా సంచోర్లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే... రాజస్థాన్కు చెందిన దీపా రామ్ గుజరాత్లో వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతడికి ఇద్దరు భార్యలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. అయితే దీపా రామ్ తల్లి విషయంలో అతడికి, ఇద్దరు భార్యలకు మధ్య కొంత కాలంగా తరచూ వాగ్వాదం జరుగుతోంది.
దీంతో దీపా రామ్ ఇద్దరు భార్యలపై కోపం పెంచుకున్నాడు. షాపింగ్ పేరుతో అతడు తన ఇద్దరు భార్యలు దరియా దేవి, మాలి దేవీలను తీసుకొని కారులో బయలుదేరాడు. మార్గం మధ్యలో మళ్లీ వారి మధ్య గొడవ తలెత్తింది.
దీంతో పట్టలేని ఆగ్రహంతో దీపా రామ్.. కారును అకస్మాత్తుగా రోడ్డు పక్కన ఆపేశాడు. అందులోంచి బయటకు వచ్చి వెంటనే కారు డోర్లు లాక్ చేసి.. దానికి నిప్పంటించాడు. దీంతో అతడి భార్యలిద్దరూ కారులోనే మంటల్లో సజీవ దహనమయ్యారు.
ఈ ఘటనలో దీపా రామ్తో పాటు అతడి కుమారుడు కూడా తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలియగానే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. దీపా రామ్.. తానే నేరం చేసినట్లు అంగీకరించడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
కారులో వాగ్వాదం ముదరడంతో అతడి భార్యల్లో ఒకరు కారు నుంచి దిగి పారిపోయే ప్రయత్నం చేసింది. అయితే.. దీపా రామ్ ఆమెను మళ్లీ కారులోకి నెట్టేసి అలాగే కొంత దూరం డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిన తర్వాత ఈ దారుణానికి ఒడిగట్టాడు.