Rajasthan Polls: కాంగ్రెస్ ను భయపెడుతున్న సర్వేలు-బీజేపీ ధైర్యం కూడా అదే..!
రాజస్తాన్ లో ఈసారి ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్, ఈసారి అధికారంలోకి రాకపోతే భవిష్యత్తు కష్టమనే బెంగలో బీజేపీ హోరాహోరీ పోరాడుతున్నాయి. రాష్ట్రంలో ఐదేళ్లకోసారి ప్రభుత్వాల్ని మార్చేసే ట్రెండ్ ఉండటంతోకాంగ్రెస్ కు భయం పెరుగుతోంది. అదే భయాన్ని సొమ్ము చేసుకుంటూ బీజేపీ దూకుడు పెంచుతోంది. ముఖ్యంగా ప్రధాని మోడీ ఫొటోతో బీజేపీ చేస్తున్న ప్రచారం హైలెట్ అవుతోంది.
రాజస్తాన్ అసెంబ్లీలో 200 సీట్లకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారనే దానిపై పలు సర్వేలు వెలువడుతున్నాయి. వీటిలో చాలా మటుకు బీజేపీకి స్వల్ప ఆధిక్యాన్ని కట్టబెడుతున్నాయి. దీనికి కారణం గెహ్లాట్ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత కంటే రాజస్తాన్ లో ఐదేళ్లకోసారి ప్రభుత్వాల్ని మార్చేసే ట్రెండ్ ఆధారంగానే ఇస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రధాని మోడీ ప్రచారంతో రాజస్తాన్ లో బీజేపీకి అనుకూలంగా పరిస్ధితులు మారుతున్నట్లు ఆయా సర్వేలు చెప్తున్నాయి.

ఐదేళ్లకోసారి ప్రభుత్వాల్ని మార్చే ట్రెండ్ గత ఐదు ఎన్నికల నుంచి రాజస్తాన్ లో కొనసాగుతున్నా కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ సంక్షేమ పాలనకు ప్రజలు మరోసారి ఓటేస్తారని గట్టి నమ్మకంతో కనిపిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య ఇస్తున్న గ్యారంటీలతో పాటు కులగణన హామీ కూడా ప్రజల్ని ఆకట్టుకుంటోంది. దీంతో సర్వే సంస్ధలు కూడా ఏకపక్షంగా కాంగ్రెస్ ఓడిపోతుందని చెప్పలేని పరిస్ధితుల్లో ఉంటున్నాయి.
అలాగే బీజేపీ కూడా గత కొంతకాలంగా దూకుడు పెంచుతోంది. ముఖ్యంగా ప్రధాని మోడీ రాజస్తాన్ లో వరుస పర్యటనలతో క్యాడర్ లో జోష్ పెంచుతున్నారు. కాంగ్రెస్ గెలిస్తే మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అశోక్ గెహ్లాట్ కూ, ప్రధాని మోడీకి మధ్య పోలిక తెస్తూ బీజేపీ చేస్తున్న ప్రచారం ఆ పార్టీకి ప్లస్ గా మారుతోంది. అయినా ఇప్పటికీ రాజస్తాన్ లో అశోక్ గెహ్లాటే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఓటర్ల ఫేవరేట్ గా ఉండటం విశేషం.












Click it and Unblock the Notifications