ఆమె ఓ ఎంబీబీఎస్ స్టూడెంట్.. ఇప్పుడు ఓ గ్రామానికి సర్పంచ్
జైపూర్: ఎంబీబీఎస్ చదువుతున్న షహనాజ్ ఖాన్(24) అనే విద్యార్థిని గ్రామ సర్పంచ్గా ఎన్నికై వార్తల్లో నిలిచింది. రాజస్తాన్ లోని భరత్పూర్ జిల్లా 'కమన్' గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆమె సర్పంచ్గా గెలిచారు.
షహనాజ్ ఖాన్ గెలుపుతో ఆమె కుటుంబం నుంచి నాలుగో తరం కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టినట్టయింది. మియో ముస్లింలు ఎక్కువగా ఉండే ఇక్కడ.. షహనాజ్ ఖాన్ కుటుంబం తమ రాజకీయ ప్రాబల్యాన్ని నిలుపుకుంటూ వస్తోంది.
షహనాజ్ ఖాన్ తల్లి కాంగ్రెస్ నేత జైదా ఖాన్. ఎమ్మెల్యేగా ఎన్నికైన మొట్ట మొదటి మియో ముస్లిం మహిళా నేత ఆమె. జైదా ఖాన్ తండ్రి తయ్యబ్ హుస్సేన్.. మూడు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేగా గెలిచిన మొట్టమొదటి భారతీయ రాజకీయ నాయకుడు కావడం విశేషం. రాజస్తాన్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల నుంచి గతంలో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు.
గత నాలుగు దశాబ్దాల నుంచి కమన్ గ్రామ సర్పంచ్ గా తన తాత హనీఫ్ ఖాన్ కొనసాగుతూ వచ్చినట్టు షహనాజ్ తెలిపారు. అయితే అటు ఎంబీబీఎస్ చదువును ఇటు సర్పంచ్ పదవిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారని ప్రశ్నించగా.. సాధ్యమే అని బదులిచ్చారు షహనాజ్.
'గురుగ్రామ్ లో నేను ఇంటర్న్ షిప్ చేస్తున్నా. మా గ్రామానికి అది అరగంట దూరం మాత్రమే. కాబట్టి ఉదయం పూట, సాయంత్రం గ్రామ సమస్యలు తెలుసుకోవడానికి సమయం ఉంటుంది. అలాగే ఆదివారం కూడా గ్రామ సమస్యల కోసమే కేటాయించాలనుకుంటున్నాను' అని షహనాజ్ స్పష్టం చేశారు.
బాలికల విద్యను ప్రోత్సహించడం, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించడం, ప్రజా ఆరోగ్యంపై దృష్టి సారించడం వంటి వాటిపై తాను ప్రధానంగా ఫోకస్ చేయనున్నట్టు తెలిపారు.
కాగా, షహనాజ్ తాత హనీఫ్ ఖాన్ నకిలీ విద్యార్హత ధ్రువ పత్రాలను తయారు చేయడంలో నిందితుడిగా తేలడంతో ఆయన సర్పంచ్ పదవిని కోల్పోయారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి కొత్తగా తీసుకొచ్చిన చట్టం ప్రకారం పదోతరగతి ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన ఉండటంతో ఆమె పోటీ చేసి విజయం సాధించింది.