కన్నడిగులకు హ్యాండ్ ఇచ్చిన బీజేపీ, కేరళ వ్యక్తికి రాజ్యసభ చాన్స్, బెంగళూరు టార్గెట్ !
బెంగళూరు: కర్ణాటక నుంచి రాజ్యసభకు కన్నడిగులే వెలుతారని ఇంత కాలం పాటపాడిన బీజేపీ నాయకులు ఇప్పుడు రివర్స్ గేర్ వేశారు. కర్ణాటక నుంచి రాజ్యసభకు కేరళకు చెందిన వ్యాపారవేత్త, ఇండిపెండెంట్ అభ్యర్థిగా 2012లో రాజ్యసభకు వెళ్లిన రాజీవ్ చంద్రశేఖర్ అధికారికంగా బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. బెంగళూరు నగర, గ్రామీణ జిల్లాల్లో బీజేపీకి ఓట్లు రావడానికి రాజీవ్ చంద్రశేఖర్ ఉపయోగపడుతారని ఆయన్ను రాజ్యసభకు పంపిస్తున్న బీజేపీ కన్నడిగులకు పెద్ద హ్యాండ్ ఇచ్చింది.
రాజ్యసభ ఎంపీ
2012 రాజ్యసభ ఎన్నికల్లో కర్ణాటక నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన రాజీవ్ చంద్రశేఖర్ బీజేపీ, జేడీఎస్ సహకారంతో రాజ్యసభ ఎంపీగా ఎన్నిక అయ్యారు. సోమవారం ఉదయం బీజేపీ తీర్థం పుచ్చుకున్న రాజీవ్ చంద్రశేఖర్ వెంటనే అధికారికంగా ఆ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా బరిలో నిలిచారు.
కన్నడిగులకు హ్యాండ్
కర్ణాటకలో త్వరలో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. శాసన సభ ఎన్నికల నేపథ్యంలో రాజ్యసభకు కన్నడిగులనే పంపించాలని, ఆ సెంటిమెంట్ తో ఎన్నికల్లో లబ్దిపోందాలని బీజేపీ రాష్ట్ర నాయకులు ప్లాన్ వేశారు.
వీఆర్ ఎల్ అధిపతి
వీఆర్ ఎల్ గ్రూప్ అధినేత, కన్నడ దినపత్రికను నిర్వహిస్తున్న విజయసంకేశ్వర్ పేరును కర్ణాటక బీజేపీ నాయకులు తెరమీదకు తీసుకు వచ్చారు. విజయసంకేశ్వర్ పేరుతో పాటు రాజీవ్ చంద్రశేఖర్ పేరును కర్ణాటక బీజేపీ నాయకులు హైకమాండ్ కు పంపించారు.
ఢిల్లీ రాజకీయం
కర్ణాటక నుంచి రాజ్యసభకు రాజీవ్ చంద్రశేఖర్ ను పంపించాలని బీజేపీ హైకమాండ్ సూచించింది. హైకమాండ్ ఆదేశాల మేరకు సోమవారం ఉదయం బీజేపీలో చేరిన రాజీవ్ చంద్రశేఖర్ తరువాత విధాన సౌదలో నామినేషన్ సమర్పించారు.
ముచ్చటగా మూడో సారి
2006, 2012లో రాజ్యసభ ఎంపీగా గతంలో రెండుసార్లు పని చేసిన రాజీవ్ చంద్రశేఖర్ ముచ్చటగా మూడోసారి ఎన్నిక కావడానికి సిద్దం అయ్యారు. బీజేపీ ఒక రాజ్యసభ ఎంపీని ఎన్నుకోవడానికి అవకాశం ఉంది. అయితే రెండో అభ్యర్థిని బరిలో దించాలని ఇన్ని రోజులు భావించిన బీజేపీ చివరి నిమిషయంలో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది.