పొలిటికల్ ఎంట్రీకే చర్చలు: సాగదీస్తున్న రజనీకాంత్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశం విషయమై మరికొద్దిరోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం రానుంది. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో రజనీకాంత్ మరోసారి రజనీకాంత్ అభిమానులతో సమావేశం కానున్
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశం విషయమై మరికొద్దిరోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం రానుంది. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో రజనీకాంత్ మరోసారి రజనీకాంత్ అభిమానులతో సమావేశం కానున్నారు.
తమిళనాడు రాష్ట్రానికి చెందిన రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారనే కొంత కాలంగా ప్రచారం సాగుతోంది.అయితే ఈ విషయమై రజనీకాంత్ మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
అయితే ఈ ఏడాది మే మాసంలో రజనీకాంత్ తమిళనాడులో తన అభిమానులతో మూడురోజులపాటు సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశంలో కూడ ఆయన నర్మగర్భంగానే వ్యాఖ్యలు చేశారు.
అయితే రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశం వార్తలపై కొన్ని తమిళ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రజనీకాంత్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగాయి. అయితే రజనీ అభిమానసంఘాలు కూడ ఆయనకు మద్దతుగా రాజకీయాల్లోకి రావాలంటూ పోటీగా ప్రదర్శనలునిర్వహించారు.
అభిమానసంఘాలతో మరోసారి రజనీకాంత్ సమావేశం
ఈ ఏడాది అక్టోబర్, లేదా సెప్టెంబర్ మాసాల్లో అభిమానులతో సమావేశం కానున్నట్టు రజనీకాంత్ గురువారం నాడు ప్రకటించారు. ఇప్పటికే మే మాసంలోనే రజనీకాంత్ అభిమానులతో సమావేశమయ్యారు. అభిమానులతో ఏడాదిలో రెండోసారి రజనీకాంత్ సమావేశం కావాలని నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకొంది.ఈ సమావేశంలోనే రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశంపై స్పష్టత వచ్చే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
8 ఏళ్ళ తర్వాత రజనీ అభిమానులతో సమావేశాలు
8 ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత రజనీకాంత్ ఈ ఏడాది సమావేశమయ్యారు. 8 ఏళ్ళ క్రితమే రజనీ అభిమానులతో సమావేశం నిర్వహించారు. అయితే రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది రజనీ సమావేశమయ్యారు. అయితే రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితి వస్తే తప్పకుండా వస్తానని రజనీ ప్రకటించారు.
రాజకీయాల్లో చేరికపై రజనీ సమావేశాలు
రాజకీయాల్లో చేరికపై తన స్నేహితులు, సన్నిహితులు, వివిధ పార్టీల నేతలు, సామాజిక కార్యకర్తలు, రైతులతో చర్చించేందుకు సినీనటుడు రజనీకాంత్ అంగీకరించాడు. అయితే రాజకీయాల్లో చేరాలనే నిర్ణయం తీసుకొన్న సమయంలో తాను అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానని ఆయన గురువారం నాడు మీడియాకు చెప్పారు.ఐదు రోజుల క్రితం రజనీకాంత్ హిందూ మక్కల్ ఖచ్చి ఫౌండర్ అర్జున్ సంపత్ ఇంటికి వెళ్ళాడు. అంతకు ముందు రోజుల తమిళనాడు రాష్ట్రంలోని 16 జిల్లాల రైతులు రజనీకాంత్ తో సమావేశమయ్యారు.
ఇంకా నిర్ణయం తీసుకోలేదు
రాజకీయాల్లో చేరే విషయమై చర్చిస్తున్నట్టు చెప్పారు.అయితే రాజకీయాల్లోకి రావాలా వద్దా అనే విషయమై ఇంకా నిర్ణయాన్ని తీసుకోలేదని రజనీకాంత్ ప్రకటించారు. ఈ విషయమై తాను నిర్ణయం తీసుకొంటే ఆ విషయాన్ని వెల్లడిస్తానని చెప్పారు. అయితే ఆయన రాజకీయాల్లో చేరిక విషయమై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని ఆయన అభిమానులు చెబుతున్నారు.